KCR | తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దశాబ్దికాలం గడుస్తున్న సందర్భంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ముగింపు వేడుకలు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నిర్ణయించారు. ఇందులో భాగంగా జూన్ ఒకటి నుంచి మూడు రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ ఒకటిన గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్బండ్ వద్దనున్న అమరజ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.
రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పిస్తారు. ఆవిర్భావం రోజున రాష్ట్రం వచ్చి దశాబ్దికాలం గడుస్తున్న నేపథ్యంలో దశాబ్ది ముగింపు వేడుకల సభను హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్నది. అదేరోజున హైదరాబాద్లోని పలు దవాఖానాల్లో , అనాథ శరణాలయాల్లో పార్టీ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్లు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 3న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యాలయాల్లో.. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణను సాధించి.. స్వరాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో దశాబ్దకాలం పాటు ప్రగతిని సాధించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేసీఆర్ పునరుద్ఘాటించారు. చారిత్రక సందర్భంలో దశాబ్ది ముగింపు వేడులను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు గులాబీ దళపతి పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా కార్యకర్తలు, పార్టీ అందించే సూచనలను అనుసరించి ముగింపు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కేసీఆర్ కోరారు.