Rajeev Sagar | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలను ఆపేందుకు బీజేపీ, దాని బీ టీం పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విపక్షాలకు నిరుద్యోగులు పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించడం ఇష్టం లేదని విమర్శించారు. పోటీపరీక్షలు జరిగితే యువత బీఆర్ఎస్ వైపు మళ్లుతారని విపక్షాలకు భయం పట్టుకుందన్నారు.
ఈ క్రమంలోనే జూన్ 11వ తేదీన నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని పిటిషన్లు దాఖలు అయ్యాయని, కానీ వాటిని కోర్టు కొట్టేసిందని రాజీవ్ సాగర్ గుర్తు చేశారు. హైకోర్టు సైతం పరీక్షలు నిర్వహించడానికి ఒప్పుకుందన్నారు. పరీక్షలు నిర్వహించాలన్నా హైకోర్టు వ్యాఖ్యలు విపక్షాలకు చెంపపెట్టని తెలిపారు. టీఎస్పీఎస్సీ కేసును సిట్ బృందం దర్యాప్తు చేస్తుందని.. కావాలనే విపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.