KCR: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి చేరుకున్న ఆయన ఆమె భౌతిక కాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం లాస్య నందిత మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే సాయన్న సతీమణిని, ఇతర కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు.
అంతకుముందు లాస్య నందిత మరణవార్త తెలియగానే కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆమె మృతికి సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమన్నారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా నందిత ప్రజల మన్ననలు పొందారని చెప్పారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కాగా, శుక్రవారం తెల్లవారుజామున పఠాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతిచెందారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. లాస్య నందిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే సాయన్న గతేడాది ఇదే నెలలో అనారోగ్యంతో మరణించారు. దాంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందితకు కేసీఆర్ కంటోన్మెంట్ సీటు ఇచ్చారు. ఆమె బీజేపీ అభ్యర్థిపై గెలుపొందారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థివదేహానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు.
లాస్య నందిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. pic.twitter.com/Wkw009xmsv
— BRS Party (@BRSparty) February 23, 2024