హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాల్సినవి. ఎదుటివారిని మనం గౌరవిస్తేనే.. మనకు గౌరవమిస్తారు. బీజేపీ నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. వారేమో ప్రొటోకాల్ పాటించరు. ఎంతటివారినైనా అవమానిస్తారు. కానీ ఇతరులకు మాత్రం సుద్దులు చెప్తారు. తమకు ఏదైనా లోపం జరిగితే ప్రొటోకాల్ పాటించడం లేదంటూ పెడబొబ్బలు పెడతారు. అందుకు కేంద్ర మంత్రి జితేందర్సింగ్ వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తాయి. ప్రధాని మోదీ హైదరాబాద్కు రెండు సార్లు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ ప్రొటోకాల్ పాటించలేదని, ప్రధానికి స్వాగతం పలకకుండా అవమానించారని కేంద్ర మంత్రి గురువారం ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు.
ఈ ట్వీట్పై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. అసలు విషయమేంటంటే.. ఇటీవల ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొటోకాల్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. దానిపై మాట్లాడిన జితేంద్ర సింగ్.. ‘ప్రధానిని ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ రావొద్దని పీఎంవో నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినందునే సీఎం వెళ్లలేదని మంత్రి కేటీఆర్ చెప్పినట్టు పత్రికల ద్వారా తెలుసుకొన్నాను. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. అక్కడితో ఆగకుండా మంత్రి కేటీఆర్ అబద్ధాలు చెప్తున్నారని, పీఎంవో నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని వెల్లడించారు. అదీగాక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిని గౌరవించే స్థితిలో కేసీఆర్, కేటీఆర్ లేరని ఆరోపించారు. ప్రధాని వస్తే కూడా స్వాగతించడం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.
అవగాహన లేకుండా అసంబద్ధ ఆరోపణలా?
కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తులు ఏం మాట్లాడాలన్నా, ఎవరినైనా నిందించే ముందు అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకొన్నాకే స్టేట్మెంట్ ఇవ్వాలి. కానీ కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ పూర్తిగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్కసుతోనే ట్వీట్ చేశారని అనిపిస్తున్నది. మంత్రి కేటీఆర్ ఏ విషయం సందర్భంగా మాట్లాడారు అనేది కూడా తెలుసుకోకుండా, ఆ విషయాలను ప్రస్తావించకుండా ఆరోపణలు చేయటం సబబు కాదని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్కు ఆరోగ్యం బాగోలేనందున ప్రధానికి స్వాగతం పలికేందుకు రావడం లేదని సీఎంవో నుంచి సమాచారం వచ్చిందని చెప్తూనే, మరోవైపు ప్రొటోకాల్ను పాటించడం లేదని నిందలు వేయడమే అందుకు నిదర్శనం. సమాచారం లేకుండా గైర్హాజరైతే తప్పుబట్టాలి కానీ సమాచారమిచ్చినా అంతేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా.. ప్రొటోకాల్ పాటించడం లేదని గవర్నర్ తమిళిసై చేసిన ఆరోపణలపై విలేకరి ప్రశ్నించగా.. గవర్నర్ గవర్నర్గా కాకుండా, బీజేపీ నేతలా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
కౌన్సిల్ ఆమోదించని గణతంత్ర ప్రసంగాన్ని చదివారని, మంత్రులపైనా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారని ఊటంకించారు. పీఎం మోదీ సైతం ఇదే రీతిన వ్యవహరిస్తున్నారని, గతంలో హైదరాబాద్కు పర్యటనకు వచ్చినప్పుడు స్వాగతం చెప్పేందుకు రావద్దంటూ పీఎంవో నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, సీఎం కేసీఆర్ను సైతం అవమానించారని వివరించారు. వ్యక్తులతో సంబంధం లేకుండా, వ్యవస్థల పరంగా ఎవరైనా గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాలని నొక్కిచెప్పారు. మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యల్లో.. ఏ సందర్భంలో పీఎంవో ఆదేశాలు ఇచ్చిందన్న విషయాన్ని చెప్పలేదు. కానీ, కేంద్ర మంత్రి.. కేటీఆర్ వ్యాఖ్యలను సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా విచ్చేసిన మోదీ పర్యటనకు ఆపాదించారు. బీజేపీ నేతల్లో తెలంగాణపై ఉన్న అక్కసును ఇది తెలియజేస్తుందని తెలంగాణవాదులు ఆక్షేపిస్తున్నారు. ప్రొటోకాల్ పాటించడం లేదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
సీఎంను అవమానించొచ్చా?
ప్రధానికి ప్రొటోకాల్ ఎలా ఉంటుందో, సీఎంకు సంబంధించి ప్రొటోకాల్ అదేవిధంగా ఉంటుంది. వాస్తవంగా భారత్ బయోటెక్లో వ్యాక్సిన్ తయారీని పరిశీలించేందుకు మోదీ వచ్చిన సందర్భంగా పీఎంవో నుంచి సీఎంవోకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ప్రధానికి స్వాగతం పలికేందుకు రావద్దని స్పష్టంగా చెప్పటం.. ముఖ్యమంత్రిని అవమానించడం కాదా? అని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోదీకి మాత్రమే ప్రొటోకాల్ ఉంటుందా? అని నిలదీస్తున్నారు. సుదీర్ఘ పోరాటం చేసి, తెలంగాణను సాధించడంతోపాటు, రెండుసార్లు అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్ను అవమానిస్తే చూస్తూ ఉరుకోవాలా? అంటూ మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా గవర్నర్ వ్యవహరిస్తున్నా భరించాలా? అని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి ఇవేవీ తెలుసుకోకుండా, పత్రికల ద్వారా తెలిసిన అసంపూర్తి సమాచారంతో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తప్పుపట్టడాన్ని ఖండిస్తున్నారు. ఇక ముందైనా, ఏదైనా విషయంపై స్పందించేముందు అన్ని విషయాలు తెలుసుకోవాలని హితవు చెప్తున్నారు.