హైదరాబాద్, జనవరి 26(నమస్తే తెలంగాణ): సాగునీరు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తే సాగు విస్తీర్ణంతోపాటు పంట దిగుబడిని పెంచడం సాధ్యమేనని తెలంగాణ నిరూపించింది. రాష్ట్ర ప్రభుత్వం పంటలకు అవసరమైన సాగునీరు, ఎరువులు, విత్తనాలను సకాలంలో అందిస్తుండటంతో రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లతో పోల్చితే ఇప్పుడు పంటల సాగు విస్తీర్ణంతోపాటు పంట ఉత్పత్తుల దిగుబడి కూడా భారీగా పెరిగింది.
రాష్ట్రంలో కొన్ని పంటల దిగుబడి జాతీయ సగటును మించి ఉండటం విశేషం. ఆయా వివరాలను తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. ఒకవైపు సాగు విస్తీర్ణం, మరోవైపు దిగుబడి పెరగడంతో రైతులకు రెండు విధాలుగా మేలు జరుగుతున్నది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రైతుబంధు, ఉచిత విద్యుత్తు పథకాలు పంటల దిగుబడి పెరిగేందుకు ఎంతగానో దోహద పడ్డాయని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అన్ని పంటల్లో పెరిగిన దిగుబడి
రాష్ట్రంలో సాగవుతున్న ప్రధాన పంటలన్నింటిలోనూ గతంతో పోల్చితే ప్రతి ఎకరాకు సుమారు రెట్టింపు దిగుబడి పెరిగింది. అత్యధికంగా మక్కజొన్నలో ఎకరాకు 1,113 కేజీలు (11 క్వింటాళ్లు) దిగుబడి పెరగడం గమనార్హం. ఆ తర్వాత వరిలో 2015-16లో ఎకరాకు 1,768 కేజీల దిగుబడి రాగా 2021-22లో ఇది 2,064 కేజీలకు పెరిగింది. అంటే ఎకరాకు 296 కేజీల (సుమారు 3 క్వింటాళ్లు) దిగుబడి పెరిగింది. వేరుశనగలో సుమారు రెండున్నర క్వింటాళ్లు, పత్తిలో క్వింటా, కందిలో ఒకటిన్నర క్వింటాళ్లు, శనగలో రెండున్నర క్వింటాళ్ల దిగుబడి పెరిగింది.
అనుబంధ రంగాల్లోనూ హవా
కేవలం వ్యవసాయరంగంలోనే కాదు అనుబంధ రంగాల్లోనూ తెలంగాణ సత్తా చాటింది. 2014తో పోల్చితే రాష్ట్రంలో పాలు, గుడ్లు, మాంసం ఉత్పత్తి భారీగా పెరిగింది. గతంలో రాష్ట్రంలో 5 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి కాగా ప్రస్తుతం అది 10 లక్షల టన్నులకు పెరిగింది. దీంతోపాటు గతంలో 1,061 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా ప్రస్తుతం ఇది 1,725 కోట్లకు పెరిగింది. 2020-21తో పోల్చితే 2021-22లో చేపల ఉత్పత్తి 12% పెరిగింది. 2020-21లో చేపల ఉత్పత్తి విలువ రూ.4,847 కోట్లు కాగా 2021-22లో ఇది 5,411 కోట్లకు చేరింది. 2020-21తో పోల్చితే పాల ఉత్పత్తి 6%, మాసం ఉత్పత్తి 10%, గుడ్ల ఉత్పత్తి 9% పెరిగింది.
నాలుగు పంటలు దేశానికి మించి
రాష్ట్రంలో వరి, మక్కజొన్న, వేరుశనగ, సోయాబీన్ పంటల దిగుబడి జాతీయ సగటును మించి నమోదవుతున్నది. 2020-21లో వరి పంటలో జాతీయ సగటు దిగుబడి ఎకరాకు 1,100 కేజీలు ఉండగా రాష్ట్రంలో 1,298 కేజీలుగా ఉన్నది. మొక్కజొన్న జాతీయ సగటు కన్నా 14.51 క్వింటాళ్ల దిగుబడి అధికంగా వస్తున్నది. వేరుశనగ 2.5 క్వింటాళ్లు, సోయాబీన్ 2 క్వింటాళ్ల చొప్పున ఉన్నది.