CM KCR | తెలంగాణ వచ్చే దాకా రైతుకు తిప్పలే ఉంటుండే! దొంగరాత్రి కరెంటు.. ఎందరినో పొట్టన పెట్టుకుంది. ఎరువుల కోసం ఎదురుచూపులు.. అప్పు కోసం పడిగాపులు.. దేశానికి అన్నం పెట్టే రైతు ఆకలిని పట్టించుకున్న నాథుడే లేడు.
తెలంగాణ రాకతో రైతుకు బలమొచ్చింది. పెద్దకాపు రాష్ర్టాన్ని కాపు కాస్తుండటంతో.. అన్నదాతల దరిద్రం తోకముడిచింది. సాగునీరు చిరునామా కనుక్కొని మరీ వచ్చి ప్రతిపొలాన్నీ ముద్దాడుతున్నది. రైతుబంధుతో తెలంగాణలో రైతు రాజయ్యాడు. గతంలో కల్లం దగ్గర కష్టాలు మాట్లాడుకునే కర్షకులు.. ఇప్పుడు కులాసాగా కబుర్లు చెప్పుకొంటున్నారు. అలాంటి ముచ్చటే నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర జోరుగా సాగింది. అన్నదాతల అసలు ముచ్చటలో హీరో మరెవరో కాదు.. మన సీఎం కేసీఆర్..
హనుమాండ్లు: ఏం పాత ఉపసర్పంచ్ సారూ! గీడ మాతోటి ముచ్చట పెట్టకుంట గటు దిక్కు సూస్తున్నవ్? తిరుగోలే ఉన్న కల్లాలన్నీ కన్ను ఆర్పకుంట సూస్తున్నవ్ ఏంది ముచ్చట?!
ప్రతాప్రెడ్డి: అరె.. ఎంత మంచి సౌలత్ ఇదీ?! అగజూడుండ్రి ఊరందరి అడ్లు (వడ్లు) ఒక్కతాటికే అచ్చినయ్.. ఒక్కతాన్నే కాంటా ఐతున్నయ్.. మునుపటి రోజులు యాది మర్సినవా. గదే కాలం నడిస్తే గీడ అడ్లు పోసుడు ఉంటుండెనా? గీడ గింత మందిమి జమ అయితుంటిమా? మన మొఖాలల్ల సంతోషం చూసి ఎన్నాళ్లయింది హనుమాండ్లు! అడ్లు పొలంకాడ కల్లాల్నే ఉన్నయి.. చెడగొట్టు ఆన అత్తే ఎట్లా అన్న బాధలేదు! అడ్లు తడిస్తే అమ్ముడుపోవు అన్న ముచ్చట్నే లేదు.. ‘నేను రాజకీయంల తిరుగుత.. ఏమైన చెప్తా.. గందుకే కేసీఆర్ మొకాన మాట్లాడుతున్నా’ అనుకుంటుండ్రేమో! రాజకీయాలు చేసేటోళ్లు గీ నాలుగు రోజులే చేస్తరు.. పదవులు ఉంటయ్, పోతయ్. కానీ నీళ్లు నీళ్లే, పాలు పాలే కదా..!
నర్సింలు: అవ్ పటేలా! ఏ మాటకు ఆ మాట చెప్పాలి. పది పన్నెండ్లేండ్ల కిందట అంతా ఎద్దు ఏడ్సిన ఎవుసమేనాయే.. మొల్క అలికింది మొదలు అమ్ముకునేదాక ఎన్ని కష్టాలు? నడుమ కొట్టుక తినేటోళ్లే ఎంత మంది ఉంటుండే. గవన్నీ ఇడ్సవెట్టుండ్రి.. ఆరుగాలం కష్టంజేసి కొనాకు గీ అడ్లు అమ్ముకోనీకి ఎంత కష్టమైతుండె. అడ్లు మల్లెపువ్వులోలె ఎంత మంచిగున్నా బేరకాళ్లు చెప్పిందే రేటు.. మనకు అచ్చిందే చాలు అన్నట్టు ఉంటుండె. గిప్పుడు ఎవుసం పండుగైంది.
శ్రీనివాస్: అవ్, ఫ్రీగా, అవసరమైనంత కరెంటిచ్చుడు, వడ్లు కొనే సౌలత్లు మంచిగున్నయ్.. సుట్టుముట్టు ఊళ్లోళ్లందరూ గీ సొసైటీ ఆఫీసు కాడికి వచ్చి చెప్పులు, పట్టా పాస్బుక్కలు లైన్లవెట్టి ఇత్తనాలు, మందు సంచుల కోసం పడిగాపులు కాసుడూ తప్పింది. ఎకరానికి ఒకటే బీస్ బీస్, రెండే యూరియా సంచులు అని రూల్ పెట్టి పోలీసోళ్లను కాపలా పెట్టి ఇచ్చేటి రోజులూ పోయినయ్.. ఎండదెబ్బ తాకి పడిపోవుడూ, ఎరువుల కోసం కొట్లాటలూ.. రక్తాలు కారుడూ లేదు.
హనుమాండ్లు: ఎవుసం ఒకటేనా శీను.. అందర్నీ పట్టించుకుంటుండు గదా! ఆ బంధు.. ఈ బంధు అని ఆపతిల అందర్నీ అర్సుకుంటుండు.
నర్సింలు: అవ్ హనుమాండ్లు.. ఒక్కొక్కటి సక్కగ జేస్కుంట వస్తున్నడు. మన రైతులకైతే సారు చేసినంత సౌలత్ దునియాల ఎవ్వలు చేయరు. నేను ఎమ్మార్వో కొలువు చేసిన.. పట్వారీ వ్యవస్థల ఎట్లుంటదో నాకు బాగా ఎరుక. ధరణితో ఎంత మంచి మార్పు వచ్చిందో గూడా తెలుసు. లాగోడి కోసం మిత్తికి తెచ్చుకునే బాధ తప్పలేదా? రైతుబంధుతో పెట్టుబడి కోసం ఎవరి కాళ్ల మీదనో పడేదీ లేదు, వడ్డీల బాధా తప్పె.. ఒక లెక్కన ఇదిగూడా మిగులుబాటే కదా! రాష్ట్రమొచ్చి పదేండ్లకే గిన్ని చేస్తే.. ఇంకో పదేండ్లకు ఇంకెన్ని చేస్తడో సోచాయించు.
ఆశన్న: అన్నీ ఏమైన గానీ, గా రైతుబీమా అయితే మంచిగున్నది. ఇయ్యాల రేపట్ల కష్టాలు లేనోడు ఓడున్నడు. గరీబోడి బతుకు కింద మీద ఐతే పెండ్లాం పిల్లలు రోడ్డు మీద పడుడే. జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని బొక్కలన్నీ తెల్లవడేదాక పనిచేసినా ఐదు లక్షలు సంపాయించుడు కష్టమే. గాచారం మంచిగ లేక ఏ రోగమో అచ్చి సచ్చిపోతే గుంట భూమి ఉన్నా సరే ఐదు లక్షలు ఇంటికి నడిసొచ్చుడు ఉట్టి ముచ్చట కాదు కదా. ఇయ్యల్ల రేపు ఎవలు ఇస్తున్నరు.
ప్రతాప్రెడ్డి: తోలుబొమ్మలాట లెక్క ఢిల్లీల ఉండి గీల్లను ఆడిచ్చుడేందో, కప్పల తక్కెడ లెక్క ఎప్పుడూ ఒగొడి కాలు ఇంకోడు పట్టి గుంజుకునుడేందో.. ఎప్పుడూ గదే సీట్ల కొట్లాటలు.. పదవులు పంచాతులు. గా కయ్యాలతోటే కాలం ఎల్లదీస్తరు తప్ప.. యాభై ఏండ్లు చూసినం గదా! మనం ఇచ్చిన హామీలేంటియి, ప్రజలకు నాలుగు మంచి పనులు ఏంజేద్దం అని ఫికర్ చేసే మంచి మనసు ఉంటదా గా ఢిల్లీ పార్టీలోళ్లకు.
భూపతిరెడ్డి: మళ్లా మూడు గంటల కరెంటు ముచ్చట చెప్తున్నరు.. దొంగోడు అచ్చేటి యాల్లకు కరెంటు ఇచ్చిన రోజుల్ని తల్సుకుంటే నాకైతే బుగులైతంది. గిన్ని లక్షల ఎకరాలకు ఫ్రీ కరెంటిచ్చుడు ఉత్త ముచ్చట కాదు.. ఇప్పుడున్నట్లే సౌలత్లు ఉండాలి.
నర్సింలు: ఒకప్పుడు పంట ఏసినం అంటే దానికి ఏ తెగులు వస్తున్నదో, ఏం మందులు వాడాల్నో చెప్పేటోడే లేకుండె. ఇప్పుడు ఎక్కడికక్కడ ఆఫీసర్ సార్లు తిరుగుతున్నరు. పంటలకు ఏ రోగాలొచ్చినా ఎప్పటికప్పుడు ఉపాయం చెప్తున్నరు. ఇంతకుముందు పది పదిహేను ఊర్లకు ఒక ఏఈవో ఉంటుండె. అసలు ఏఈవో అంటేనే తెల్వకపోతుండె. ఇంకో మాట.. ఎవరికి ఆల్లు నాకేం పాయిదా అనుకుంటే… మనిషికి న్యాయం జరుగుతదా! అందరి గురించి ఆలోచిస్తనే సరైనోళ్లకు ఓటేస్తం.
రాజిరెడ్డి: ఇప్పుడేమంటరు నర్సింలు సార్.. పాలిచ్చే బర్రెను అమ్ముకొని నడ్డి మీద తన్నేటి దున్నపోతును కొనుక్కొచ్చుకున్నట్లు చేసుకోవద్దు.. అంటరు అంతేగదా?! కరెక్టే బండమీద పంట పండిచ్చినట్టు తెలివిగ పనులుజేస్తుండ్రు.. గీళ్లతోనే తెలంగాణకు ఇంత తెల్వడి అచ్చింది! పొట్టకూటి కోసం బౌరూపులోళ్లు (బహురూపులవారు) అచ్చినట్టు అధికారం కోసం మాటలు చెప్పేటోళ్లు మస్తు మంది అస్తుంటరు.. అదిగూడా గీ నాలుగు రోజులే. నిజమేదో, అబద్ధమేదో మనమే తెలుసుకోవాలి. మంచి చేసేటోళ్లను మనమే కాపాడుకోవాలి! అందుకే మళ్లీ కేసీఆర్ సారుకే ఓటేయాలె!!
… ఆరుట్ల నరేశ్, ఫొటోలు : నీరడి శ్రీనివాస్