హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పర్యాటక రంగాన్ని విస్తృత స్థాయిలో ప్రోత్సహిస్తున్నారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించడంలో సీఎం కేసీఆర్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. వరల్డ్ ట్రావెల్ మార్ట్లో భాగంగా ఆయన లండన్లో తెలంగాణ టూరిజం రోడ్షోను ప్రారంభించారు. ప్రపంచంలోనే ఉత్తమ పర్యాటక గ్రామంగా పోచంపల్లి ఎంపిక కావడం చరిత్రాత్మకమన్నారు.
తెలంగాణ పర్యాటక వైభవాన్ని లండన్ వేదికగా ప్రపంచ దేశాలకు, పర్యాటకులకు, ట్రావెల్ ఏజెంట్లకు తెలియజేస్తున్నామని, దీనిలో భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని, కాఫీ టేబుల్ పుస్తకాలను టూర్ ఆపరేటర్లకు, పర్యాటకులకు ఉచితంగా అందించామని తెలిపారు. రోడ్షోలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎండీ మనోహర్, టూరిజం అధికారులు మహేశ్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ కమలాకర్, అధ్యక్షుడు శ్రావణ్గౌడ్, తెలంగాణ జాగృతి, ట్రావెల్ ఏజెంట్స్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు, ఇండియా టూరిజం అధికారులు పెద్ద సంఖ్య లో పాల్గొని విజయవంతం చేశారు.