హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను బేఖాతరు చేస్తూ పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను కొనసాగిస్తున్నదని తెలంగాణ పేర్కొన్నది. పనులను వెంటనే అడ్డుకోవాలని కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. పనులు జరుపొద్దంటూ ఎన్జీటీ 2021 డిసెంబర్లో ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తూ శ్రీశైలం కుడి ప్రధాన కాలువ నుంచి పోతిరెడ్డిపాడు వరకు కాలువ లైనింగ్ పనులను చేపట్టారని,ఇందులో ప్రధాన భాగం పూర్తయినట్టు తెలిపారు. మొత్తం పూర్తయితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పెద్ద ఎత్తున నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీకి వీలు కలుగుతుందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీ 1,500 క్యుసెక్కులకు మించి నీటిని తరలించరాదని, వెంటనే ఏపీ పనులను అడ్డుకోవాలని కోరారు.