హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): చేనేత రంగాన్ని బతికించుకోవడం మనందరి బాధ్యతని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రతి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు చేనేతను ధరిస్తున్న మాదిరిగానే.. అన్ని శుభకార్యాల్లోనూ నేత వస్ర్తాలనే కట్టుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మన రాష్ట్ర చేనేతరంగానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్నదని తెలిపారు. శనివారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పీపుల్స్ప్లాజాలో వారం రోజులపాటు కొనసాగే వస్త్ర ప్రదర్శనను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేతను ప్రధానరంగంగా గుర్తించిన సీఎం కేసీఆర్ స్వరాష్ట్రంలో దాని పరిరక్షణకు చర్యలు చేపట్టారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ రంగానికి బడ్జెట్లో కేవలం రూ.70 కోట్లు కేటాయించగా స్వరాష్ట్రంలో రూ.1,200 కోట్లకు పెంచారని గుర్తుచేశారు. 1905లో ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభానికి గుర్తుగా భారత ప్రభుత్వం 2015లో ఆ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించిందని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మహదేవ్పూర్ టస్సర్ సిల్క్ చీరలతోపాటు అనేక నూత న డిజైన్లను టెస్కో విజయవంతంగా వెలుగులోకి తెచ్చిందన్నారు. చేనేత కళాకృతులైన తేలియా రుమాల్ ఆర్మూర్ పట్టు, పీతాంబరి పట్టు, సిద్దిపేట గొల్లభామ చీరలు, హిమ్రూ రకాలను పునరుద్ధరించి.. ఆధునికతను జోడించడం ద్వారా ప్రాచుర్యం కల్పిస్తున్నామన్నారు.
చేనేత అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా లేనివిధంగా పథకాలను అమలుచేస్తున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. నేతన్నకు చేయూతలో భాగంగా చేనేత కార్మికులతోపాటు అనుబంధ చేనేత పనివారు పొదుపు చేసుకొనే మొత్తానికి ప్రభుత్వం ద్వారా 16 శాతం మూలనిధిని అందిస్తున్నామని చెప్పారు. ఈ పథకంలో భాగంగా 20,537 మంది లబ్ధిదారులకు రూ.96.43 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఈ పథకాన్ని మరో మూడేండ్లపాటు కొనసాగించాలని నిర్ణయించామని, 2021-22 సంవత్సరానికి ప్రభుత్వం రూ.30 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ వివిధ రకాల వస్ర్తాలు, ఆయా రాష్ర్టాల స్టాల్స్ను సందర్శించారు.
రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థకు చెందిన ఈ-గోల్కొండ పోర్టల్ ద్వారా చేనేత ఉత్పత్తులను విక్రయించేందుకు టెస్కో, టీఎస్హెడీసీ లు అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నా యి. దీనికి సంబంధించిన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. దీని ప్రకారం టెస్కో ఉత్పత్తులను గోల్కొండ బ్రాండ్ పేరుతో ఆన్లైన్లో విక్రయిస్తారు. టెస్కోకు వచ్చిన ఆదాయంలో 5శాతం సర్వీస్ చార్జీని టీఎస్హెడీసీకి చెల్లిస్తారు.
చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని 31 మంది చేనేత, వస్త్ర రంగ ప్రముఖులకు మంత్రి కేటీఆర్.. కొండా లక్ష్మణ్బాపూజీ అవార్డులను ప్రదానం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నేతన్నకు చేయూత, చేనేతమిత్ర, పావలా వడ్డీ పథకం లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. పునరుద్ధరించిన పీతాంబరి, హిమ్రూ, ఆర్మూర్ చీరలను మార్కెట్లోకి విడుదల చేశారు. వర్చువల్ పద్ధతిలో ఏర్పాటుచేసిన ఆధునిక డిజైన్ల వస్త్ర ఫ్యాషన్షోను ప్రారంభించారు. పోచంపల్లి చేనేత వస్ర్తాలకు భౌగోళిక గుర్తింపు తెచ్చిన పలువురు చేనేత ప్రముఖులకు జ్ఞాపికలు అందచేశారు. గట్టుప్పల్కు చెందిన కర్నాటి విద్యాసాగర్ అందించిన 15 ఆసు యంత్రాలను పంపిణీచేశారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్ర్తాలు ధరించాలంటూ పీపుల్స్ ప్లాజాలో కార్యక్రమానికి హాజరైన వారితో కేటీఆర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భం గా చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ఒక ప్రత్యేక కళ అని.. ఇది భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుందని కొనియాడారు. స్వరాష్ట్రం లో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చి అభివృద్ధి చేసుకొంటూ వస్తున్నదని తెలిపారు. గత పాలనలో కునారిల్లిన చేనేత రంగాన్ని ప్రభుత్వ దార్శనికత, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో అనతికాలంలోనే పునరుజ్జీవింప చేసుకున్నామని చెప్పారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యాన్ని గుర్తించి, ఆదరించి ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. దీంతో కార్మికులను ఆత్మహత్యల నుంచి దూరంచేసి వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నదన్నా రు. బతుకమ్మ చీరలు తదితర కార్యక్రమాలతో వారికి చేతినిండా పని కల్పించి, ఆర్థికంగా భరోసానిస్తున్నామని చెప్పారు.