Telangana | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయ్యింది. అక్కడక్కడ చెదురుమదరు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ పూర్తయ్యింది. ఎన్నికల్లో పోటీ చేసిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమయ్యింది. ఆ ఫలితం డిసెంబర్ 3వ తేదీన తేలనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ జరగడంతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేయగా, 119 నియోజకవర్గాలకుగాను 119 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న పది నియోజకవర్గాలు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న నియోజకవర్గాల్లో లెక్కింపులో జాప్యం జరుగకుండా ఉండేందుకు అధికంగా టేబుళ్లను ఏర్పాటుచేస్తున్నారు. కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, పటాన్చెరు తదితర నాలుగు నియోజకవర్గాల్లో 400లకుపైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో ఈ నియోజకవర్గాల్లో 20+1 టేబుళ్లు, అలాగే రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, కూకట్పల్లి, మేడ్చల్ తదితర ఆరు నియోజకవర్గాల్లో 500లకుపైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఈ నియోజకవర్గాల్లో 28+1 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
బ్యాలెట్ల కోసం ప్రత్యేక టేబుళ్లు….
పోస్టల్ బ్యాలెట్ల కోసం ఈసారి ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటుచేయాలని ఈసీ నిర్ణయించింది. ఈవీఎంల కౌంటింగ్ పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కూడా పూర్తిచేసేలా ప్లాన్చేసింది. ఇందుకోసం 500ఓట్లకు ఒకటి చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒకవేళ ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలోగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకుంటే, చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపును నిలిపివేసి ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును పూర్తిచేయాలని, ఆ తరువాతే చివరి రౌండ్ ఈవీఎంల లెక్కింపు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈసారి 119నియోజకవర్గాలకుగాను దాదాపు రెండున్నర లక్షల పోస్టల్ బ్యాలెట్లను జారీచేశారు.