నాగర్ కర్నూల్ : ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యా విధానాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
సోమవారం జిల్లాలోని ఎల్లమ్మ రంగాపూర్, వంగూరు గ్రామాల్లో మన ఊరు- మన బడి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రాథమిక విద్యను పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచే ఆంగ్ల విద్యకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
ఎల్లమ్మ రంగాపూర్ ప్రాథమిక, జిల్లా పరిషత్ , వంగూరు జడ్.పి.హెచ్ఎస్ పాఠశాలల మౌలిక వసతుల కోసం 3. 10 కోట్లు నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మొత్తం మూడు విడతల్లో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు పంపొద్దని, ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని సూచించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుమారు ఆరేడు నియోజకవర్గాలలో సాగునీరు సంపూర్ణంగా అందుతుందని మిగతా ప్రాంతాలకు అలాగే అచ్చంపేట ప్రాంతానికి సంపూర్ణ సాగు నీరు అందేలా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలందరూ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.