హైదరాబాద్, మార్చి 17 : ఆర్థిక వృద్ధిలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలో పటిష్టమైన పునాదులపై పునర్నిర్మాణం అవుతున్న తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అనూహ్య ఫలితాలు సాధిస్తున్నది. 2014-15 నుంచి రాకెట్ వేగంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న తెలంగాణ, 2021-22 ఆర్థిక సంవత్సరంలో సగర్వంగా అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ (ఎంవోఎస్పీఐ) విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న 19 రాష్ర్టాల సమాచారం ఆధారంగా రూపొందించిన నివేదికలో జీఎస్డీపీ వృద్ధిలో రెండు, తలసరి ఆదాయ వృద్ధిలో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ నిలిచింది. తెలంగాణ జీఎస్డీపీ రూ.11.54 లక్షల కోట్లు, తలసరి ఆదాయం రూ.2.78 లక్షలుగా నివేదిక నిర్ధారించింది.
తలసరి వృద్ధి రేటు 10.8 శాతం
2021-22లో స్థిర ధరల వద్ద తలసరి ఆదాయ వృద్ధిరేటులో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, త్రిపుర, ఒడిశా, రాజస్థాన్, కర్ణాటక ఉన్నాయి. స్థిర ధరల వద్ద తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.62 లక్షలుగా ఉన్నదని నివేదిక తెలిపింది. డబుల్ ఇంజిన్ గ్రోత్గా చెప్పుకొనే ఉత్తరప్రదేశ్ ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నది. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించింది. 2014లో రూ.1,24,104 ఉన్న తలసరి ఆదాయం, 2021-22లో రూ.2,78,833కు చేరింది. ఏడేండ్లలో 121 శాతం పెరిగింది. నివేదిక ప్రకారం తలసరి ఆదాయంలో తెలంగాణ మూడోస్థానంలో ఉన్నది. గోవా (రూ.4,91,352), సిక్కిం (రూ.4,80,593) మొదటి రెండు రాష్ర్టాల్లో నిలిచాయి. పెద్ద రాష్ర్టాల క్యాటగిరీలో తెలంగాణ నంబర్ వన్గా ఉన్నది. 2020-21తో పోల్చితే 2021-22లో రాష్ట్ర తలసరి ఆదాయం 44,132 పెరిగింది.
ఒకేసారి కర్ణాటక, హర్యానాను అధిగమించాం
తలసరి ఆదాయంలో తెలంగాణ 2021-22లో అనూహ్య వృద్ధి సాధించి ఒకేసారి కర్ణాటక, హర్యానాను అధిగమించినట్టు నివేదిక తెలిపింది. 2020-21లో రాష్ట్ర తలసరి ఆదాయం ఈ రెండు రాష్ర్టాల కన్నా తక్కువ అని, పెద్ద రాష్ర్టాల క్యాటగిరీలో మూడో స్థానం లో ఉండేదని పేర్కొన్నది. ఒక్క సంవత్సరంలోనే కర్ణాటకను, హర్యానాను అధిగమించినట్టు స్పష్టం చేసింది.
జీఎస్డీపీ వృద్ధిలో అగ్రస్థానం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్డీపీ) స్థిరంగా పెరుగుతూనే ఉన్నది. వృద్ధిరేటులో అగ్రగామి రాష్ర్టాల్లో ఒకటిగా నిలుస్తున్నది. కరోనా ప్రభావం ఉన్న 2019-20, 2020-21లోనూ వెనక్కి తగ్గలేదు. జీడీపీతోపాటు అనేక రాష్ర్టాల వృద్ధిరేటు మైనస్లోకి వెళ్లినా, తెలంగాణ మాత్రం పాజిటివ్ వృద్ధి సాధించింది. జీఎస్డీపీ విలువ ఒకే సంవత్సరంలో ఏకంగా రూ.1,85,204 లక్షల కోట్లు పెరిగింది. ఇది దేశంలోనే రెండో స్థానం. ప్రస్తుత ధరల వద్ద జీఎస్డీపీ 19.1 శాతం వృద్ధితో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్ 19.7 శాతంతో మొదటి స్థానంలో ఉన్నది. తెలంగాణ తర్వాతి స్థానాల్లో ఏపీ, కర్ణాటక, హర్యానా నిలిచాయి. జీఎస్డీపీ స్థిర ధరల వద్ద గణించినా తెలంగాణ ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. 2020-21తో పోల్చితే 2021-22లో 11.2 శాతం వృద్ధి సాధించింది. పెద్ద రాష్ర్టాల క్యాటగిరీలో ఇది రెండో స్థానం.