ప్రత్యేక ప్రతినిధి, మే 31, (నమస్తే తెలంగాణ): కరోనా కాటుతో దేశ సంపద భారీగా క్షీణించింది. ఈ ఏడాది మార్చి నెలాఖరుతో ముగిసిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రూ.145 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేయగా.. అది రూ.135 లక్షల కోట్లకే పరిమితమైంది. జీడీపీ పెరగకపోగా మైనస్ 7.3 శాతం ప్రతికూల (నెగెటివ్) వృద్ధిరేటు నమోదైనట్టు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) వెల్లడించింది. ఇదే సమయంలో జాతీయ సగటు కంటే తెలంగాణ రాష్ట్రం మెరుగైన ఫలితాలను సాధించి ఆర్థికంగా నిలదొక్కుకున్నది. కరోనా సంక్షోభంతో తీవ్రమైన గడ్డు పరిస్థితులు ఎదురైనప్పటికీ తెలంగాణ గ్రాస్ స్థూల సంపద (జీఎస్డీపీ) కేవలం 1.26 శాతం మాత్రమే క్షీణించింది. 2019-20 అంచనాల కంటే ఈసారి తెలంగాణ సంపద కొద్దిగా తగ్గినప్పటికీ వ్యవసాయ, అనుబంధ రంగాల్లో అపూర్వ ప్రగతి సాధించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 20.9 శాతం వృద్ధిరేటు సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా తలసరి ఆదాయంలో 0.61 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకున్నది. సవరించిన అంచనాల ప్రకారం.. 2020-21లో రాష్ట్ర స్థూల సంపద రూ.9,65,355 కోట్లుగా ఉన్నది. 2021-22లో ఇది రూ.9,78,373 కోట్లుగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికశాఖ అంచనా వేసింది. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర సంపద అనూహ్యంగా పెరుగుతున్నది. ఏటా లక్ష కోట్లకుపైగా పెరుగుదలతో 10 శా తం కంటే అధిక వృద్ధిరేటుతో దూసుకెళ్తున్నది. ముందస్తు అంచనాలకంటే వృద్ధిరేటు తగ్గినప్పటికీ ఈసారి రాష్ట్ర సంపద రూ.13,018 కోట్లు పెరిగింది. ఇది జాతీయ సగటు కంటే ఎంతో మెరుగ్గా ఉండటం గమనార్హం.
తలసరి ఆదాయంలో రాష్ట్రం ఉరుకులు
కరోనా కాలంలోనూ తలసరి ఆదాయాన్ని పెంచుకోగలిగిన అతికొద్ది రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.2,25,756గా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం ఈ సారి 0.61 శాతం పెరిగి రూ.2,27,145కు చేరింది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం 4.8 శాతం క్షీణించింది. 2019-20లో రూ.1,34,186గా ఉన్న జాతీయ తలసరి ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,27,768కు దిగజారింది.