రవీంద్రభారతి/మలక్పేట/హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తేతెలంగాణ): ఆరోగ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని, దాన్ని నెరవేర్చేందుకు కృషి చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్కు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సూచించారు. బుధవారం హైదరాబాద్లోని వైద్యవిధానపరిషత్తులో ఎర్రోళ్లకు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ నియామక పత్రాన్ని హరీశ్రావు అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమకారుడు ఎర్రోళ్లను సంస్థ చైర్మన్గా సీఎం కేసీఆర్ నియమించటం సంతోషంగా ఉన్నదని అన్నారు. రోగులకు త్వరితగతిన ఆరోగ్య పరీక్షలు చేసి, మందులు అందించే గొప్ప బాధ్యత ఇప్పుడు ఎర్రోళ్లపై ఉన్నదని చెప్పారు. తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం కేసీఆర్కు ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ నూతన అధ్యక్షుడిగా రచయిత, కవి జూలూరు గౌరీశంకర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గొప్ప సాహితీ అభిమాని అని, కవులను, కళాకారులను ప్రోత్సహిస్తూ వారికి సముచిత గౌరవం కల్పిస్తున్నారని చెప్పారు. నిరంతరం సాహిత్యం కోసం కృషిచేస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు గౌరీశంకర్ అని కొనియాడారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కవులు, కళాకారులను గుర్తించి వారికి సముచిత న్యాయం తెలంగాణ ప్రభు త్వం కల్పిస్తున్నదని పేర్కొన్నారు. జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ.. 10 ఉమ్మడి జిల్లాల్లో సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల వ్యాప్తికి, వాటిని రికార్డులు చేయటం, గ్రంథాలుగా రూపొందించటానికి కృషి చేస్తానని స్పష్టంచేశారు.
దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్గా డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మూడోసారి బాధ్యతలు చేపట్టారు. దివ్యాంగుల సంక్షేమ భవన్లో ఆ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. దివ్యాంగుల సమాజానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సేవ చేసేందుకు మరోసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, అందుకు సహకరించిన మంత్రులు కే తారకరామారావు, కొప్పుల ఈశ్వర్, రాజ్యసభసభ్యుడు సంతోష్కుమార్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, వీ శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బీ వినోద్కుమార్, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, ఆల వెంకటేశ్వరరెడ్డి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, నరేందర్, భేతి సుభాష్రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, దామోదర్రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎం యాదవరెడ్డి, ఎల్ రమణ, కార్పొరేషన్ల చైర్మన్లు ఒంటేరు ప్రతాప్రెడ్డి, సాయిచంద్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, నగేశ్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, మేకల, గొర్రెల అభివృద్ధి సంస్థ చైర్మన్ బాలరాజుయాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్రెడ్డి తెలంగాణ సంగీత నాటక అకాడమీ సెక్రటరీ జీ వసుంధర తదితరులు పాల్గొన్నారు.