హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): స్టయిఫండ్ తదితర సమస్యలపై మంగళవారం నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మెను విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో మంత్రి రాజనర్సింహ మంగళవారం సచివాలయంలోని తన చాంబర్లో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(జూడా), తెలంగాణ సీనియర్ రెసిడెంట్స్ అసోసియేషన్ (ఎస్ఆర్డీఏ) ప్రతినిధులతో సమావేశమయ్యారు.
అనంతరం జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కౌశిక్కుమార్ మాట్లాడుతూ.. ఇకపై తమకు ప్రతి నెల 15వ తేదీలోగా స్టయిఫండ్ చెల్లిస్తామని, పెండింగ్ ైస్టయిఫండ్ను విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. ఉస్మానియా జనరల్ దవాఖానకు కొత్త భవనం నిర్మాణానికి రెండు నెలల్లో శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని హాస్టల్స్ గదులు సరిపోవడం లేదని వివరించగా మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో చదువుతున్న పీజీ విద్యార్థులకు కూడా ైస్టయిఫండ్ ఇవ్వాలన్న ఎన్ఎంసీ నిబంధనలను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. విదేశాల్లో మెడిసిన్ చదివి ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్న విద్యార్థులకు సైతం తమతో సమానంగా ైస్టయిఫండ్ చెల్లించే అంశంపై సమీక్షిస్తానని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.