CWC Meeting | పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణం సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీకి, ఏపీ సర్కారు కేంద్ర జలసంఘం (CWC) అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం పట్టువదలకుండా చేస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ముంపుపై అధ్యయనం కోసం నియమిత కాలపరిమితిని విధించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపుతోపాటు, ఇతర అనేక సాంకేతిక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలతో ఏకాభిప్రాయం సాధించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సీడబ్ల్యూసీ రెండుసార్లు అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. తాజాగా మరోసారి ఢిల్లీలో సోమవారం మూడో సమావేశాన్ని నిర్వహించింది. ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను, అభ్యంతరాలపై మరోసారి చర్చించింది. కేంద్ర జల సంఘం చైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన సాగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో తెలంగాణ మరోసారి తన వాదనలను బలంగా వినిపించింది.
జాయింట్ సర్వే అంశంపై సమావేశంలో తెలంగాణ ప్రధానంగా పట్టుబట్టింది. పోలవరం బ్యాక్ వాటర్స్ ఎఫెక్ట్పై ఉమ్మడి సర్వే చేపట్టాలని తెలంగాణ డిమాండ్ను జనవరి 25న నిర్వహించిన రెండవ సాంకేతిక సమావేశాల్లోనే సీడబ్ల్యూసీ అంగీకరించింది. ఏపీని సమన్వయం చేసుకుంటూ సంయుక్త సర్వే చేపట్టాలని పీపీఏకు అప్పుడే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రస్తుత సమావేశంలో తెలంగాణ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో సీడబ్ల్యూసీ వెంటనే స్పందించింది. ఉమ్మడి సర్వేను పూర్తికి నియమిత కాలపరిమితిని విధిస్తూ పీపీఏకు అల్టిమేటం జారీ చేసింది. అందులో భాగంగా తొలుత ఏప్రిల్ పదిలోగా తెలంగాణ, ఏపీ ఇరురాష్ట్రాలతో సమావేశం నిర్వహించాలని పీపీఏను ఆదేశించింది.
ముంపుపై ఇరు రాష్ర్టాలు గతంలో చేసిన అధ్యయనాలపై, రూపొందించిన మ్యాపులపై చర్చించాలని దిశానిర్దేశం చేసింది. తదననంతరం ఉమ్మడి సర్వేను సత్వరమే చేపట్టాలని నొక్కిచెప్పింది. ఇదిలా ఉండగా సమావేశంలో సమావేశానికి హాజరైన ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు సైతం పలు డిమాండ్లను సీడబ్ల్యూసీకి నివేదించాయి. ముంపునకు సంబంధించి గోపాలకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను ఎట్టిపరిస్థితులోనూ అంగీకరించేది లేదని, కొత్తగా అధ్యయనం చేసి, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. సీడబ్ల్యూసీ చైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేంద్రరావు, చీఫ్ ఇంజినీర్ కొత్తగూడెం శ్రీనివాస్రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, తెలంగాణ ఇంటర్ స్టేట్ బోర్డు గోదావరి డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్ ఇంజినీర్ సుధాకర్, ఒడిశా ఈఎన్సీ అశుతోష్దాస్, కేంద్ర జల సంఘం, పోలవరం అథారిటీ అధికారులు పాల్గొన్నారు.