Telangana Decade Celebrations | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉత్సవాల రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సెక్రెటేరియట్లోని తన ఛాంబర్లో మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఖరారు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల రోజువారీ ప్రకటించారు. అవతరణ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సదస్సుకు సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు, జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. జూన్ 2న హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ జరుపుతారు. అనంతరం దశాబ్ధి ఉత్సవ సందేశం ఇవ్వనున్నారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ధి ఉత్సవ కార్యక్రమాలు సాగనున్నాయి.
జూన్ 3 శనివారం నాడు ‘తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరంటు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేయనున్నారు.
జూన్ 4న ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘సురక్షా దినోత్సవం’ నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్థవంతంగా సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిలాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
జూన్ 5వ తేదీ సోమవారం ‘తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’ జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదేరోజు సింగరేణి సంబురాలు జరుపుతారు.
జూన్ 6న మంగళవారం ‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’ జరుగుతుంది. పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు. 7న బుధవారం ‘సాగునీటి దినోత్సవం’ నిర్వహిస్తారు. సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఉంటాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి గారు హాజరవుతారు.
జూన్ 8న ‘ఊరూరా చెరువుల పండుగ’ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. గోరేటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్య కారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. నాయకులు, ప్రజలు కలిసిచెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.
జూన్ 9 శుక్రవారం రోజున ‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’ జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు జరుపుతారు. తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్ర భారతిలో సభ ఉంటుంది.
జూన్ 10న శనివారం ‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’ జరుపుతారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు.
జూన్ 11న ‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’ నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులందజేస్తారు.
జూన్ 12న సోమవారం ‘తెలంగాణ రన్’ నిర్వహిస్తారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
జూన్ 13 మంగళవారం ‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’ నిర్వహిస్తారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు. ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేస్తారు.
జూన్ 14న ‘తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవా’న్ని ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగంలో జరిగిన విప్లవాత్మక అభివృద్ధి గురించిన సమాచారాన్ని, సందేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందజేస్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధి గురించి వివరిస్తారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజున నిమ్స్లో 2వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానా నూతన భవన నిర్మాణానికి, నిమ్స్ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
జూన్ 15 గురువారం ‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’ జరుపుతారు. ఈ సందర్భంగా దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే పలు కార్యక్రమాలుంటాయి. అవార్డు సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు.
జూన్ 16న శుక్రవారం ‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’ నిర్వహిస్తారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలుంటాయి.
జూన్ 17న శనివారం ‘తెలంగాణ గిరిజనోత్సవం’ జరుపుతారు. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తారు.
జూన్ ఆదివారం ‘తెలంగాణ మంచి నీళ్ల పండుగ’ నిర్వహిస్తారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి.
జూన్ 19న సోమవారం ‘తెలంగాణ హరితోత్సవం’ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.
జూన్ 20న ‘తెలంగాణ విద్యాదినోత్సవం’ నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. అదేరోజున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలల ప్రారంభిస్తారు. అదే సందర్భంలో సిద్ధమైన 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్స్ లను ప్రారంభిస్తారు. విద్యార్ధులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తారు.
జూన్ 21న ‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’ నిర్వహిస్తారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు, ఇతర మత ప్రార్థనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి.
జూన్ 22న ‘అమరుల సంస్మరణ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తెలంగాణవ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు. హైదరాబాదులో అమరుల గౌరవార్ధం ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. హైదరాబాద్లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ అదే రోజున ఆవిష్కరించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్లో నిర్వహించే సభలో పాల్గొంటారు.