హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కళారూపాలు పేరిణి నాట్యం, గుస్సాడి నృత్యం ఢిల్లీవాసులను మంత్రముగ్ధులను చేశాయి. సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా ఉన్న లాన్స్లో, జ్ఞాన్పథ్ వద్ద తెలంగాణకు చెందిన కళాకారులు ‘భారత్ పర్వ్-2023’లో భాగంగా పేరిణి నాట్యం, గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించారు.
గణతంత్ర వేడుకల్లో భాగంగా జ్ఞాన్పథ్ వద్ద రెండేండ్ల తరువాత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రఖ్యాత కళాకారులు పేరిణి ప్రకాశ్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. వీటికి కనక సుదర్శన్ సారథ్యం వహించారు. తెలంగాణ కళాకారులను తెలంగాణ రెసిడెంట్ కమిషన్ గౌరవ్ ఉప్పల్ అభినందించారు.