హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సాధించిన పురోగతిపై బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడం, అదనపు అంతస్తుల నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని బోధన మరియు జిల్లా ఆసుపత్రుల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్ మరియు ఐసీయూ పడకలను పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాలపై దృష్టి పెట్టాలని, వ్యాక్సినేషన్ కోసం మిగిలిన వారందరినీ గుర్తించుటకు ప్రత్యేక “మాప్ అప్ డ్రైవ్” నిర్వహించాలని అధికారులను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డి, టీఎస్ ఎమ్ఐడీసీ ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, టిఎస్ఐఐసి సీఈ శ్యామ్ సుందర్, టిఎస్ ఎంఐడిసి సీఈ రాజేంద్రతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.