Telangana | హైదరాబాద్ : వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) చేపట్టిన విప్లవాత్మక పథకాల వల్ల రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రమాణాల్లో గణనీయమైన మెరుగుదల సాధించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి( CS Shanti Kumari ) వెల్లడించారు. వైద్య ఆరోగ్య శాఖపై బీఆర్కే భవన్( BRK Bhavan )లో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మెహంతి, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు( Kanti Velugu ), కేసీఆర్ కిట్( KCR Kit ), కేసీఆర్ న్యూట్రిషన్ కిట్( KCR Nutrition Kit ), మహిళా జర్నలిస్టులకు కాంప్రహెన్సివ్ హెల్త్ చెకప్లతోపాటు ఎన్నో విప్లవాత్మక పథకాలతో రాష్ట్ర ప్రజల ఆరోగ్య, జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 13, 28, 808 మందికి కేసీఆర్ కిట్స్ను అందజేశామని, తద్వారా 29 .10 లక్షల మంది లబ్ది పొందారని తెలిపారు. ఈ కేసీఆర్ కిట్స్ను ఉచితంగా ప్రారంభించినప్పటి నుండి రాష్ట్రంలో సంస్థాగత ప్రసవాలు అధికం అయ్యాయని అన్నారు. ప్రస్తుతం 95 శాతం ప్రసవాలు సంస్థాగతంగా జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం నుండి 61 శాతానికి పెరిగాయని తెలిపారు. ప్రాథమిక వైద్య కేంద్రాల్లో ప్రసవాలను జరిపితే ప్రోత్సాహక పురస్కారాలను కూడా సిబ్బందికి అందిస్తున్నామని సీఎస్ చెప్పారు.
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందచేసేందుకు గాను రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని సీఎస్ స్పష్టం చేశారు. ఈ కిట్స్ వల్ల మాతా శిశు మరణాల సంఖ్య తగ్గిందన్నారు. మరి కొద్ది రోజుల్లో ఈ కేసీఆర్ న్యూట్రిషన్ ఫుడ్ కిట్స్ను అన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నామని వెల్లడించారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళా( Arogya Mahila ) కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 5214 మంది మహిళలకు ఎనిమిది రకాల వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ప్రతీ మంగళవారం ప్రత్యేకంగా నిర్వహించే ఈ ఆరోగ్య మహిళా కార్యక్రమం క్రింద వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని రాష్ట్రంలోని మహిళలకు శాంతి కుమారి సూచించారు.
దాదాపు 57 రకాల పాథాలజికల్ పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు 22 జిల్లాలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్స్( Telangana Diagnostics ) ద్వారా ఇప్పటివరకు 49 లక్షల మందికి 8.90 కోట్ల పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. దాదాపు రెండు కోట్ల మంది ప్రజలకు తక్షణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు గాను ప్రవేశపెట్టిన 352 బస్తీ దవాఖానాల ద్వారా ఇప్పటివరకు కోటి 14 లక్షల మందికి ఓపీ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మరో 46 బస్తీ దవాఖానాలు త్వరలోనే ప్రారంభించనున్నామని తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు( Women Journalists ) మాస్టర్ హెల్త్ చెకప్లను( Master Health Checkup ) నిర్వహించనున్నట్టు సీఎస్ తెలిపారు. దాదాపు 56 రకాల పారామీటర్లు, 12 పరీక్షలు ఈ మాస్టర్ హెల్త్ చెకప్ ద్వారా నిర్వహిస్తామని, ఇందుకు గాను సమాచార శాఖ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.