హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శాంతిభద్రతలను కొనసాగించే క్రమంలో చిన్న నేరాలను కూడా ఉపేక్షించబోమని డీజీపీ ఎం మహేందర్రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి నేరపూరిత చర్యపై ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నందువల్లనే ఆ సంఖ్య అధికంగా కనిపిస్తున్నదని తెలిపారు. ప్రతి నేరాన్ని నమోదు చేసినప్పుడే నేరస్థులకు శిక్షపడేలా చేయగలమని అన్నారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన నేర గణాంకాలపై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కొన్ని కథనాలపై డీజీపీ మంగళవారం స్పందించారు.
డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో అదేస్థాయిలో సైబర్ నేరాలు పెగుతున్నాయని డీజీపీ తెలిపారు. ప్రధానంగా జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా నేరాలకు పాల్పడుతున్నారని, ఈ నేరాలపై దర్యాప్తులో తెలంగాణ పోలీసులు ఇతర అన్ని రాష్ర్టాల పోలీసులకంటే ముందున్నారని చెప్పారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటుచేసిన సైబర్ క్రైం కో-ఆర్డినేషన్ సెంటర్, సైబర్ క్రై హెల్ప్లైన్ 1930, నేషనల్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్లో మన రాష్ర్టానికి సంబంధించిన సైబర్ నేరాల దర్యాప్తులో తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు అత్యంత వేగంగా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. జూన్, 2021 నుంచి సైబర్ నేరగాళ్లకు చేరకుండా రూ.116 కోట్ల సొమ్మును ఫ్రీజ్ చేయగా, అందులో రూ.26.6 కోట్లు తెలంగాణ పోలీసులే అడ్డుకొన్నారని వెల్లడించారు. లోన్ యాప్స్ మోసగాళ్లు, కేబీసీ లాటరీ మోసాలు, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ మోసాలపై దేశవ్యాప్త నెట్వర్లను గుర్తించి ఛేదించడంలో తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నమోదైన 34 వేల కేసులకు సంబంధించిన లింకులను కనిపెట్టి కేంద్ర హోంశాఖకు అందించినట్టు తెలిపారు.
సైబర్ నేరాలు, సైబర్ నేరస్థులను ట్రాక్ చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సైక్యాప్స్ అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ను 25 రాష్ట్రాలు ఉపయోగిస్తున్నాయని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. సైక్యాప్స్ అప్లికేషన్ రూపొందించినందుకు ఐటీ అప్లికేషన్ల తయారీలో తెలంగాణ పోలీస్ విభాగానికి కేంద్ర ప్రభుత్వం మొదటి బహుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ అవార్డును బుధవారం అందజేయనున్నట్టు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా, బాలకార్మికులు, ఇతర కేసుల నమోదు, దర్యాప్తులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నదని తెలిపారు. 31 జిల్లాల్లో ఏహెచ్టీయూ (యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు)లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 2021లో 347 కేసులను ఐపీసీ సెక్షన్లు 370, 370(ఏ)తోపాటు స్థానిక చట్టాల కింద బుక్ చేసి, 480 మంది ట్రాఫికర్లను అరెస్టు చేసినట్టు వెల్లడించారు.