ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నం
రాష్ట్రంలో 7.7% పెరిగిన పచ్చదనం
8వ విడత లక్ష్యం 19.54 కోట్ల మొక్కలు
‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అటవీ మంత్రి అల్లోల
ఆదిలాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హరితహారం కార్యక్రమంతో తెలంగాణ రికార్డు సాధించిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో మానవ ప్రయత్నమని చెప్పారు. దీని ఫలితంగానే రాష్ట్రంలో 7.7% పచ్చదనం పెరిగిందన్నారు. త్వరలో 10% గ్రీనరీ సాధించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇంటర్వ్యూ వివరాలు..
గత ఏడు విడతల్లో ఎన్ని మొక్కలు నాటారు?
హరితహారం ప్రపంచంలోనే అతిపెద్ద మూడో మానవ ప్రయత్నంగా రికార్డు సాధించింది. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. ఏడేండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 246.17 కోట్ల మొక్కలు నాటాం. ఇందుకోసం ప్రభుత్వం రూ.8,511 కోట్లు వెచ్చించింది. ప్రభుత్వం స్థానిక సంస్థలకు మంజూరు చేసే నిధుల్లో 10 శాతం గ్రీనరీ బడ్జెట్ ఉంటుంది.
ఎనిమిదో విడతలో ఎన్ని మొక్కలు నాటనున్నారు?
ఎనిమిదో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 19.54 కోట్ల మొక్కలను నాటుతున్నాం. జిల్లాల వారీగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. వానకాలం పూర్తయ్యే వరకు మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతుంది. అడవుల్లో బ్లాక్ ప్లాంటేషన్లు, రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్తోపాటు పట్టణాలు, గ్రామాల్లో ఖాళీ ప్రదేశాల్లో వివిధ మొక్కలు నాటుతారు. ప్రజలు తమ ఇళ్లల్లో మొక్కలను పెంచుకునేందుకు అవసరమైన పండ్లు, పూల మొక్కలను అందజేస్తాం. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాం.
హరితహారంలో మొక్కలు సరఫరా చేస్తారా?
ప్రతి పంచాయతీకి ప్రభుత్వం నర్సరీలను మంజూరు చేసింది. వాటిల్లో హరితహారానికి అవసరమైన మొక్కలను పెంచుతున్నారు. ఒక్కో నర్సరీలో ఏటా 40 వేల మొక్కల వరకు పెంచుతున్నారు. గ్రామాల్లో, ప్రజలు తమ ఇళ్లల్లో పెంచుకునేందుకు పూలు, పండ్లు, ఇతర మొక్కలు వీటిలో ఉంటాయి. అడవుల్లో నాటడానికి అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 నర్సరీల్లో మొక్కల పెంపకం కొనసాగుతున్నది.
ప్రజల భాగస్వామం ఎలా?
ప్రజల సహకారంతో హరితహారం విజయవంతంగా కొనసాగుతున్నది. కరోనా సమయంలో ఆక్సిజన్ ఆవశ్యకతను ప్రజలు గుర్తించారు. మొక్కల పెంపకం వల్ల పర్యావరణ సంరక్షణ, ఆక్సిజన్ లభిస్తుందని, చెట్లు ఉంటేనే తాము, భావితరాలు ఆరోగ్యంగా ఉంటాయనే విషయం ప్రజలందరికీ తెలుసు. దీంతో మొక్కల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. తమ పరిసరాలు, ఇండ్లల్లో మొక్కలు పెంచుతున్నారు. రైతులు తమ పొలాల గట్లపై నాటిన మొక్కలు బాగా పెరిగాయి. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణ అందించడానికి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది.
ఏడు విడతల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయి?
పచ్చదనం పెంపొందించడంలో చైనా, బ్రెజిల్తో తెలంగాణ పోటీ పడుతున్నది. నాలుగేండ్లలో తెలంగాణలో 7.7% పచ్చదనం పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు వెల్లడించాయి. త్వరలో 10% గ్రీనరీ సాధించడానికి ప్రణాళికలు ఉన్నాయి. అటవీ విస్తీర్ణం పెరుగుదలలో దేశంలో రెండో స్థానంలో ఉన్నం. మెగా సిటీల్లో పచ్చదనం పెంపుదలలో హైదరాబాద్ మొదటి స్థానం సాధించింది. అటవీ ప్రాంతాల్లో చేపట్టిన రీ జనరేషన్ మంచి ఫలితాలనిచ్చింది. 9.65 ఎకరాల్లో అడవులు దట్టంగా పెరిగి పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి. పర్యావరణ సంరక్షణ, గ్రీనరీల్లో కేంద్రం ఇస్తున్న అవార్డులు మనకే ఎక్కువ వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించడం సంతోషం.