అంబలి తాగినా, గట్క తిన్నా మా రెక్కల కష్టమే
కాకతీయుల చెరువులతో కల్పతరువుగా పల్లెలు
ఉమ్మడి పాలనలో పొక్కిలి తేలిన బతుకులు
స్వరాష్ట్రంలో కష్టపడి కరువును పారద్రోలినం
దేశానికే అన్నంపెట్టే అన్నపూర్ణగా అవతరించినం
మా ఆత్మగౌరవాన్ని ఎగతాళి చేస్తే పాతరేస్తం
గోయల్ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం ఫైర్
హైదరాబాద్, మార్చి 26 : దుమ్ములేసే దుబ్బ ఇసుకలో దుబ్బు కంకులు పండించిన శ్రమ మాది.. చుక్కచుక్కను ఒడిసిపట్టి మెతుకు మెతుకుగా పేర్చిన తెలివి మాది.. కాలానికి ఎదురు నిలిచి, గెలిచిన బతుకు మాది.. సద్ద సంకటి తిన్నా, జొన్న అంబలి తాగినా ఎవడి ముందూ తల వంచని పౌరుషం మాది. నూకల బువ్వైనా, రాగి ముైద్దెనా మా కష్టమే మా తిండి.. అది మా ఆత్మగౌరవం.. అంటున్నది తెలంగాణ సమాజం.. ‘ప్రజలకు నూకలు తినటం నేర్పించండి’ అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారంపై కన్నెర్రజేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలను గుర్తుచేసుకొంటున్నది. స్వరాష్ట్రంలో దేశానికే బువ్వపెట్టే అన్నపూర్ణగా ఎదిగామని సగర్వంగా చాటుతున్నది. గోయల్ వ్యాఖ్యలు తెలంగాణ మట్టి మనుషులు మనసులను కలచివేస్తున్నాయి. వలస పాలకులు చేసిన గాయాలపై ఇప్పుడిప్పుడే కడుతున్న పక్కులను తిరగదోడుతున్నాయి. ఒకనాడు అన్నమో రామచంద్రా అంటూ బుక్కెడు బువ్వ కేడ్చినోళ్లు.. స్వరాష్ట్రంలో దేశానికే అన్నం పెడుతున్నారనే సత్యాన్ని ఒప్పుకోలేక, ఓర్వలేక తూలనాడుతున్నారని మండిపడుతున్నారు.
వలస పాలనలో నలిగి..
తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు భూ భౌతిక పరిస్థితులకు అనుగుణంగా గొలుసుకట్టు చెరువులను నిర్మించటంతో వ్యవసాయాభివృద్ధి గణనీయంగా జరిగింది. ప్రతి పల్లె స్వయం సమృద్ధిని సాధించింది. నాటి సాహితీవేత్తలు రచించిన క్రీడాభిరామం, బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర తదితర రచనలే అందుకు నిలువుటద్దం. ఇంతటి స్వయం సమృద్ధ నేల సీమాంధ్రతో కలువటంతోనే ప్రాభవం కోల్పోవటం మొదలైంది. పంటలతో పసిడి కాంతులు విరిసిన పల్లెల్లో పాలకుల తీవ్ర వివక్షతో పల్లేర్లు మొలిచాయి. చెరువులు గిన్నెలైనాయి. ఫలితంగా బుక్కెడు బువ్వకు కూడా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ‘నగరాల్లో/ అత్యధికంగా/ అత్యద్భుతంగా/ అస్తి పంజరాల్ని/ చెక్కే ఉలి/ ఆకలి’ అంటూ అలిశెట్టి ప్రభాకర్ రాసిన కవిత నాటి సామాజ దైన్య స్థితిని ప్రతిబింబిస్తుంది.
స్వరాష్ట్రం అన్నపూర్ణ
స్వరాష్ట్ర కల సాకారమైన వెంటనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మిషన్ కాకతీయ పేరుతో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు స్వల్పకాలంలోనే ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా అవతరించింది. ఆకలి చావు అనే మాట అంతరించింది. రేషన్ బియ్యం పంపిణీపైనా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిని సారించారు. ఏటా ఆహార సబ్సిడీకి నిధులను పెంచుతున్నారు. రాష్ట్రంలో 90.50 లక్షల రేషన్ కార్డులుండగా, 2.88 కోట్ల మందికి, ప్రతి నెలా 1.60 లక్షల టన్నుల బియ్యాన్ని సబ్సిడీ ధరకు అందిస్తున్నారు. గతంలో ఒక్కో వ్యక్తికి 4 కేజీల బియ్యం ఇస్తుండగా, దానిని 6 కేజీలకు పెంచారు. పరిమితులు లేకుండా కుటుంబంలో ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికీ ఆరు కేజీల బియ్యం నెల తిరిగేసరికి ప్రతి ఇల్లూ చేరుతున్నాయి. హాస్టళ్లు, స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాలకు కూడా సన్నబియ్యం సరఫరా చేస్తున్నారు.
ఎందుకీ ఏడుపు?
తెలంగాణ కష్టాలు తీరి కడుపారా భోజనం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కండ్లు మండుతున్నాయి. అడుగడుగునా వివక్ష చూపుతూ పూటకోరకంగా మాటలతో అవమానిస్తున్నది. ‘మా రైతులు పుట్లకొద్దీ ధాన్యం పండించారు తీసుకోండి అని అడిగితే, మీ ప్రజలకు నూకలు తినడం నేర్పించండి’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనటం బీజేపీ అహంకారానికి పరాకాష్ట అని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కేంద్రం ముందు చేతులు చాచి సాగిలపడకుండా సగర్వంగా తలెత్తుకొని ఉత్తరాది రాష్ర్టాలకంటే శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో కేంద్రంలోని కొందరికి మింగుడు పడటంలేదని విమర్శిస్తున్నారు. ‘తెలంగాణ దేన్నైనా భరిస్తది. కానీ ఆత్మగౌరవం జోలికొస్తే ఊరుకోదు. తస్మాత్ జాగ్రత్త’ అని హెచ్చరిస్తున్నారు. మంత్రి పీయూష్ గోయల్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.