హైదరాబాద్, అక్టోబర్11 (నమస్తే తెలంగాణ): బోగస్ కంపెనీలను సృష్టించి రూ.45.67 కోట్ల మేరకు జీఎస్టీ రీఫండ్ పొంది భారీ మోసానికి పాల్పడ్డ ఓ ముఠా గుట్టును తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ రట్టు చేసింది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసి, కోర్టు ఎదుటు హాజరుపరిచింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ డాక్టర్ టీకే శ్రీదేవి తెలిపిన వివరాల ప్రకారం.. ఎలక్ట్రిక్ బైక్లకు సంబంధించి జీఎస్టీ రీఫండ్ను కాజేయాలనే దురుద్దేశంతో ఏడుగురు నిందితులు ముఠాగా ఏర్పడ్డారు.
శివసాయి ఎంటర్ప్రైజేస్, మాగ్నమ్, యోక, అపెక్స్, గ్రోమోర్, సుప్రియా ఎలక్ట్రిక్ బైక్స్, వినరాడ్ ఆటోమొబైల్స్ పేరిట మొత్తం 7 బోగస్ కంపెనీలను సృష్టించారు. ఢిల్లీ కేంద్రంగా ఆయా కంపెనీలను రిజిస్ట్రర్ చేశారు. అక్కడి నుంచి ఎలక్ట్రిక్ బైక్ల విడిభాగాలను కొనుగోలు చేస్తున్నట్టుగా, తెలంగాణలోవాటిని విక్రయిస్తున్నట్టు చూపి మొత్తం రూ.45.67 కోట్లను కాజేశారు. ఈ వ్యవహారంపై అనుమానంతో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి నేతృత్వంలో అధికారులు విచారణ చేపట్టారు. కంపెనీలు లేవని, విడిభాగాల కొనుగోళ్లు, బైక్ల అమ్మకాలు అంతా బోగస్ అని తేల్చారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన నిందితుడు వేమిరెడ్డి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచినట్టు కమిషనర్ శ్రీదేవి వెల్లడించారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.