Airport Metro | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఎయిర్పోర్టు మెట్రో రైలు రూటు మార్పుతో ప్రభుత్వంపై కిలోమీటరుకు అదనంగా రూ.50 కోట్ల భారం పడనున్నది. కేసీఆర్ సర్కారు శంకుస్థాపన చేసిన రాయదుర్గం-ఎయిర్పోర్ట్ మెట్రో మార్గంతో రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా, కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించే రెండు రూట్లలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రూ.250 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. చాంద్రాయణగుట్ట నుంచి మైలార్దేవ్పల్లి, జల్పల్లి, పీ7 రోడ్డు మీదుగా విమానాశ్రయం వరకు ఒక అలైన్మెంట్. ఇది సుమారు 13 కిలోమీటర్ల వరకు వస్తుంది. బార్కాస్, పహాడీ షరీఫ్, శ్రీశైలం రోడ్డు మీదుగా విమానాశ్రయం వరకు ఇంకో అలైన్మెంట్. ఇది దాదాపు 17 కిలోమీటర్ల వరకు వస్తుంది. ఈ రెండు మార్గాల్లో కచ్చితంగా భూ సేకరణ చేపట్టాల్సి ఉన్నది. దీంతో ఖర్చు భారీగా పెరగనున్నది. అయితే, రాయదుర్గం మార్గంలో ఔటర్ రింగ్రోడ్డు వెంట గతంలోనే మెట్రోకు భూమిని కేటాయించిన నేపథ్యంలో 31 కిలోమీటర్లలో సుమారు కిలోమీటరు మినహా మిగిలిన చోట్ల భూసేకరణ అవసరం లేదు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం కేసీఆర్ ప్రభుత్వం రాయదుర్గం-ఎయిర్పోర్టు అలైన్మెంట్ను ఖరారు చేసింది. వాస్తవానికి 2018లోనే ఈ ప్రతిపాదనపై అధ్యయనం చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఢిల్లీ మెట్రో రైలు బృందం ఈ అలైన్మెంట్పై అధ్యయనం చేసి 2020లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇచ్చింది. రూ.6,250 కోట్లతో రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణాన్ని చేపట్టాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా గత ఏడాది నవంబరు 27న కేసీఆర్ ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులు సర్వే చేసి, మార్క్ కూడా చేశారు. టెండర్ల ప్రక్రియలో భాగంగా నిర్మాణ పనులు చేపట్టేందుకు ఎల్అండ్టీ, ఎన్సీసీ కంపెనీలు ముందుకొచ్చాయి.
అయితే ఏ ఏజెన్సీని ఎంపిక చేయాలనే నిర్ణయం మాత్రం పెండింగ్లో ఉన్నది. రెండ్రోజుల క్రితం సీఎం రేవంత్రెడ్డి మెట్రో రైలు ప్రాజెక్టుపై సమీక్ష జరిపి, ఆ ప్రాజెక్టును రద్దు చేశారు. పాతబస్తీ మెట్రోలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఎలాగూ ప్రాజెక్టును చేపడుతున్నందున అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను పొడిగించాలని సూచించారు. ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా కూడా శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను కొనసాగించాలని ఆదేశించారు. ఫలక్నుమా నుంచి చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్ నుంచి చాంద్రాయణగుట్ట.. రెండు మార్గాలు ఒకచోట కలిశాక ఒకే మార్గంగా శంషాబాద్ విమానాశ్రయం వరకు అలైన్మెంట్ను రూపొందించాల్సి ఉన్నది. ఇందులో తక్కువ వ్యయంతో అయ్యే మార్గాన్ని ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.