మీకు ఏదైనా పుస్తకం కావాలా? మార్కెట్లో కొనలేకపోతున్నారా? అయితే మీరు సమీపంలోని పౌర గ్రంథాలయానికి వెళ్లండి.. అక్కడున్న రిజిస్టర్లో మీకు కావాల్సిన పుస్తకం పేరు రాయండి. అంతే మీరు కోరిన పుస్తకం వారం రోజుల్లో లైబ్రరీలో ఉంటుంది. ఈ పుస్తకాన్ని మీరు గ్రంథాలయంలో ఎన్నిసార్లయినా చదువుకోవచ్చు. నోట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి అద్భుత అవకాశాన్ని రాష్ట్రంలోని పౌర గ్రంథాలయాలు కల్పిస్తున్నాయి.
హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు ఆధ్వర్యం లో నడుస్తున్న పౌర గ్రంథాలయాల్లో ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ను అమలు చేస్తున్నారు. అభ్యర్థులు కోరితే ఎంత డబ్బునైనా వెచ్చించి పుస్తకాలు తెప్పించి గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ స్కీమ్లో భాగంగా గతంలో ఒక్కో గ్రంథాలయం నెలకు రూ.50వేలు వెచ్చించి అభ్యర్థులు కోరిన పుస్తకాలను కొనుగోలు చేసే వెసులుబాటు ఉండ గా, తాజాగా ఈ సీలింగ్ను ఎత్తేశారు. అభ్యర్థులు ఎన్ని కోరితే అన్ని రకాల పుస్తకాలను ఖర్చుకు వెనుకాడకుండా అందుబాటులో ఉం చుతున్నారు. ఇలా 2021లో 7,069 పుస్తకాలను కొనుగోలు చేశారు. 2022 నుంచి ఇప్ప టి వరకు 9,542 పుస్తకాలను కొని అందుబాటులో ఉంచారు.
ఇటీవల కాలంలోనే ప్రభుత్వం నుంచి సుమారు 43 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. దీంతో అభ్యర్థులంతా ప్రిపరేషన్లో మునిగి పోయారు. అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి రావడంతో ఉద్యోగార్థులు అర్హత ఉన్న వాటన్నింటికీ పోటీపడుతున్నారు. వీరంతా సన్నద్ధమయ్యేందుకు భారీగా వెచ్చించి పుస్తకాలను కొనాల్సి వస్తున్నది. ఇది వారికి భారంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో వారికి ఉపశమనం కల్పిస్తూ ఆన్ డిమాండ్ బుక్ సిస్టంను విజయవంతంగా అమలుచేస్తున్నారు. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలకు అధికంగా డిమాండ్ ఉన్నది.
వరుస నోటిఫికేషన్ల నేపథ్యంలో ఉద్యోగార్థులు గ్రంథాలయాలకు పోటెత్తుతున్నారు. అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటన వెలువడిన నాటి నుంచే అభ్యర్థుల తాకిడి పెరుగుతూ వస్తున్నది. 2021లో గ్రంథాలయాల్లో పాఠకుల సంఖ్య 2.5 లక్షలు మాత్రమే కాగా, 2022 జనవరి వరకు 6 లక్షలకు చేరుకున్నది. నేటి వరకు 9 లక్షలకు పైచిలుకు ఆ సంఖ్య చేరింది. వరుసగా గ్రూప్స్, హాస్టల్ వార్డెన్, అసిస్టెంట్ ఇంజినీర్, జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కావడంతో అంతా ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు. అంతకు ముందే ప్రభుత్వం పెద్ద ఎ త్తున పుస్తకాలను అందుబాటులో ఉంచడంతోపాటు గ్రంథాలయాలను అభివృద్ధి చేసిం ది. ఈ నేపథ్యంలో పాఠకుల సంఖ్య క్రమంగా
పెరుగుతున్నది.
ఉద్యోగార్థుల అవసరాలు తీర్చడమే గ్రంథాలయాల లక్ష్యం. 33 జిల్లాల్లో ఎక్కడా పుస్తకాల కొరత లేదు. ఆన్ డిమాండ్ బుక్ సిస్టం గ్రంథాలయాల్లో నిరంతర ప్రక్రియ. దీనిపై సీలింగ్ను ఎత్తివేసి.. అభ్యర్థులు కోరిన పుస్తకాలను తెచ్చి పెడుతున్నాం. తెలుగు అకాడమీ, బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సహా ఇతర పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నాం.
– డాక్టర్ అయాచితం శ్రీధర్, తెలంగాణ గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో ఖర్చుకు వెనుకాడకుండా.. ఉద్యోగార్థులు కోరిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతు న్నాం. రీడింగ్రూమ్స్ ఏర్పాటు చేస్తు న్నాం. నోటిఫికేషన్ల నేపథ్యంలో గ్రంథాలయాల వేళలను పెంచాం. కొన్ని రాత్రి 8 వరకు, మరికొన్ని రాత్రి 10 గంటల వరకు నడుస్తున్నాయి.
– పీ సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి