CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా కమలాపురంలోని బల్లార్పూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బిల్ట్) మిల్లును పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆయన సోమవారం ఉన్నతాధికారులు, ఫిన్క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రై.లి. కంపెనీ ఎండీ హార్దిక్ పటేల్, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈవో వాదిరాజ్ కులకర్ణితో సమావేశమయ్యారు. బిల్ట్ ఆస్తులు ప్రస్తుతం ఫిన్క్వెస్ట్ సంస్థ ఆధీనంలో ఉన్నా యి.
ఈ సందర్భంగా సీఎం వారితో బిల్ట్ మిల్లును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు, సాధ్యాసాధ్యాలను వారితో చర్చించారు. కమలాపురంలోని బిల్ట్ మిల్లులో వస్ర్తాల తయారీకి ఉపయోగించే కలప గుజ్జును తయారు చేస్తారు. ఈ మిల్లు 2014లో మూతపడింది. దీంతో దాదాపు 750 కార్మిక కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. వీరందరితోపాటు స్థానికులకు ఉపాధి కల్పించేందుకు ఈ మిల్లును పునఃప్రారంభించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు.
బిల్ట్ ఆస్తుల కొనుగోలుకు ఐటీసీ ఆసక్తి
మరోవైపు బిల్ట్ ఆస్తుల కొనుగోలుకు ఐటీసీ కంపెనీ ఆసక్తి చూపుతున్నది. ఐటీసీతో చర్చల ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిన్క్వెస్ట్ కంపెనీని సీఎం కోరారు. బిల్ట్ మిల్లును పునరుద్ధరించే ప్రక్రియలో ఐటీసీకి అన్ని విధాలా ప్రభుత్వ సహకారం అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు.
సీఎంతో కోకాకోలా ప్రతినిధిబృందం భేటీ
ప్రముఖ శీతల పానియాల తయారీ సంస్థ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ (హెచ్సీసీబీ) తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధి బృందం సోమవారం సచివాలయంలో సీఎం కలిసి తమ సంస్థ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించింది. రాష్ట్రంలో కొత్త ప్లాంట్ల ఏర్పాటుపై కంపెనీ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోకాకోలా దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది.
సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్లో తలపెట్టిన గ్రీన్ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. పెట్టుబడులకు రక్షణ కల్పించటంతోపాటు పరిశ్రమల స్థాపనకు సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. కంపెనీల ఏర్పాటుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో సులభ వాణిజ్య విధానం అమల్లో ఉంటుందని అన్నారు. హెచ్సీసీబీ పబ్లిక్ అఫైర్స్ చీఫ్ హిమాన్షు ప్రియదర్శని, కంపెనీ ప్రతినిధులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.