ఒక్కరోజే 56 మంది మృతి
హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతున్నది. మంగళవారం రాష్ట్రంలో 8,061 కొత్త కేసులు వెలుగుచూశాయి. కరోనా, ఇతర కారణాలతో 56 మంది మరణించినట్టు బుధవారం విడుదలచేసిన బులిటెన్లో వైద్యారోగ్యశాఖ తెలిపింది. 5,093 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో రికవరీ రేటు 82.31 శాతంగా, జాతీయ సగటు 82.3 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 72 వేలు దాటింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,508, మేడ్చల్ మల్కాజిగిరిలో 673, రంగారెడ్డిలో 514 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా బుధవారంనాటికి 26,121 పడకలు అందుబాటులో ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. ప్రభుత్వ దవాఖానల్లో 7,594, ప్రైవేటులో 18,527 పడకలు అందుబాటులో ఉన్నాయి.
లక్ష మందికి టీకాలు
రాష్ట్రంలో మంగళవారం లక్ష మందికి టీకాలు వేశారు. ఇందులో 89,650 మందికి మొదటి డోస్ వేయగా, 19,238 మందికి రెండో డోస్ వేశారు. మొత్తంగా ఇప్పటివరకు దాదాపు 44 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.