హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్న సిటిజన్ చార్టర్ విధానం యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో గత కొన్నేండ్ల నుంచి అమలవుతున్న ఈ విధానం వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని స్ఫూర్తిగా తీసుకున్నది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సిటిజన్ చార్టర్ను అమల్లోకి తీసుకురానున్నది. రాష్ట్రంలో ఇప్పటికే అందజేస్తున్న సేవలకు తోడుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మరికొన్ని సేవలను సిటిజన్ చార్టర్ పరిధిలోకి తీసుకొచ్చారు. కేంద్రం సూచించిన 18 అంశాలను ఇందులో చేర్చారు. దీంతో తెలంగాణలోని గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 48 రకాల సేవలు సిటిజన్ చార్టర్లోకి వస్తాయి. రాష్ట్రంలో దీన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు ఇటీవల జిల్లా స్థాయి అధికారులకు మరోసారి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
రెండ్రోజుల్లో ధ్రువీకరణ పత్రాలు
సిటిజన్ చార్టర్ ద్వారా లభించే సేవల వివరాలు అందరికీ తెలిసేలా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న రెండు పనిదినాల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల పరిధిలో భవన నిర్మాణాలకు 15 రోజుల్లోగా, లేఅవుట్లకు సంబంధించిన అనుమతులను 44 రోజుల్లోగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్తి పన్ను, మంచినీటి సరఫరా, కనెక్షన్లు, మరమ్మతులు, పనుల నాణ్యత, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, సామాజిక ఆస్తులు, గ్రామ పరిపాలన, అభివృద్ధికి సంబంధించిన అంశాలతోపాటు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు, వృత్తి, వ్యాపార అనుమతులకు సంబంధించిన దరఖాస్తులు, ఫిర్యాదులను కూడా సిటిజన్ చార్టర్ ద్వారా స్వీకరిస్తారు.