హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): భారత దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం గ్యాలంట్రీ అవార్డులను ప్రకటించింది. ఆర్మ్డ్ ఫోర్స్ల శౌర్యానికి చిహ్నంగా ఇచ్చే ఈ అవార్డుల్లో కశ్మీర్ శ్రీనగర్ సెక్టార్లో తెలంగాణ కేడర్ ఐపీఎస్ చారుసిన్హా నేతృత్వం వహిస్తున్న వ్యాలీ క్యూఏటీ(క్విక్ యాక్షన్ టీం) 40 గ్యాలంట్రీ మెడల్స్తో పాటు ఒక శౌర్యచక్రను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో చారుసిన్హా ప్రత్యేకంగా మాట్లాడారు. ‘మా క్యూఏటీకి 40 గ్యాలంట్రీ మెడల్స్ వచ్చాయి. వీటిలో ఒకటి మరునోప్రాంత్(మరణించిన వారికి) ఇచ్చే అవార్డు ఉంది. సీఆర్పీఎఫ్ వ్యాలీ క్యూఏటీ నా సూపర్ విజన్లో పనిచేస్తుంది. ప్రతి ఆపరేషన్ దగ్గరుండి నేనే లీడ్ చేస్తాను. ఎన్కౌంటర్స్లో మిలిటెంట్స్ను న్యూట్రలైజ్ చేసినందుకు ఈ మెడల్స్ వచ్చాయి’ అని అన్నారు. కాగా, స్వాతంత్య్రదిన వేడుక సందర్భంగా కేంద్రం 1,082 మంది సీఏపీఎఫ్, రాష్ర్టాల పోలీసు సిబ్బందికి పలు క్యాటగిరీల్లో పురస్కారాలు ప్రకటించింది.