Telangana VRA | హైదరాబాద్ : రాష్ట్రంలోని వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వీఆర్ఏలను క్రమబద్దీకరించాలని కేబినెట్ నిర్ణయించినట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశం దాదాపు మూడు గంటలకు పైగా కొనసాగిన విషయం విదితమే. ఈ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డితో కలిసి హరీశ్రావు కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
వీఆర్ఏల క్రమబద్దీకరణకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్కు కేబినెట్ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ 15 రోజుల్లో ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వనపర్తి జర్నలిస్టు అసోసియేషన్కు 10 గంటల స్థలం కేటాయింపు. ఖమ్మంలో జర్నలిస్టుల ఇళ్ల కోసం 23 ఎకరాలు స్థలం కేటాయింపు చేసినట్లు తెలిపారు. మైనార్టీ కమిషన్లో జైన్ కమ్యూనిటీ యాడ్ చేస్తూ నిర్ణయం, కమిషన్ సభ్యులుగా ఒకరికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. టీఎస్పీఎస్సీలో 10 పోస్టుల మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు.