తెలంగాణకే మకుటాయమానంగా శోభిల్లనున్న రాష్ట్ర పరిపాలనా కేంద్రం.. నూతన సచివాలయం, ప్రతి జిల్లాలో కొలువుదీరుతున్న కలెక్టరేట్లు, నవీనకాలంలో నభూతో నభవిష్యతి అనిపించేలా దిద్దితీర్చిన యాదగిరి గుట్ట నరసింహుని ఆలయం!! ప్రపంచంలోనే ఎంచతగిన టెక్ ఇంక్యుబేటర్లలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన టీ హబ్!! టెక్ నగరాన్ని ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించే పొడవైన ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, తీగల వంతెన.. ప్రశాంత ప్రయాణానికి తిరుగులేని మెట్రో!
సంఘం శరణం గచ్ఛామి.. అంటూ సమాజానికి చేతన కల్పించిన బోధనలు సల్పిన బుద్ధుని అడుగుజాడలను చూపే సువిశాల బుద్ధ వనం.. అమరుల తాగ్యాలను నిత్యం జ్వలించే అమరుల స్మృతివనం!! ఎక్కడో పాతాళాన ఉన్న గంగమ్మను మల్లన్న సిగకు ఎదురెక్కించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. మల్లన్నసాగర్ వంటి అద్భుత జలాశయాలు! ఇప్పుడు యావత్తు తెలంగాణకు రక్షణ దుర్గంగా నిలిచే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్!!
ఒకటా రెండా.. తెలంగాణ మునుపెన్నడూ చూడనివి.. చూస్తామని ఊహించనవి.. అత్యద్భుత కట్టడాలు!! ఇవి మేడలు కాదు.. తెలంగాణ ప్రగతి జాడలు.. తెలంగాణ నవ్య భవితవ్యానికి బంగారు బాటలు!!
పనులకు శంకుస్థాపన: 2016 అక్టోబర్11
ప్రారంభం: మార్చి 28, 2022
తెలంగాణను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంతోపాటు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నంత ప్రాభవాన్ని కల్పించడమే లక్ష్యం. నేడు తెలంగాణకే కాదు యావత్తు దేశానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా స్వాతంత్య్రానంతరం దేశంలో నిర్మించిన అతి పెద్ద రాతికట్టడంగా గుర్తింపు పొందింది. పూర్తిగా నల్లరాతి శిలలతో, ఎత్తయిన ప్రాకారాలు, రాజగోపురాలతో పర్యాటకులను, భక్తులను ఆకర్షిస్తున్నది. రాబోయే కాలంలో దేశంలోని ప్రధాన పుణ్యతీర్థ స్థలిగా వినుతికెక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పనులకు శంకుస్థాపన: 2016 జూన్ 2న
ప్రారంభం తేదీ: దసరాకు ప్రారంభించేందుకు సన్నాహాలు..
తెలంగాణ స్వరాష్ట్రం కోసం 60 ఏండ్ల పోరాటానికి ఆనవాలుగా, అమరుత్యాగానికి చిహ్నంగా
రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ నడిబొడ్డున, హుస్సేన్ సాగర్ ఒడ్డున అమరుల స్మృతివనాన్ని నిర్మిస్తున్నారు. నిత్యం అమరులను స్మరించుకునే విధంగా జ్వలించే దీపం నిత్యం వెలిగేలా ఈ స్మృతి వనం ఉంటుంది. ఏ దేశం నుంచి పర్యాటకులు, ఇతర ప్రముఖులు హైదరాబాద్కు వచ్చినా అమరుల స్మృతివనం సందర్శించేలా దీనిని తీర్చిదిద్దుతున్నారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలకు, స్టార్టప్లకు వేదికగా టీ హబ్ తొలి దశ 2015 నవంబర్ 5న అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, మంత్రి కేటీఆర్ చేతుల ఆవిష్కృతమైంది. తాజాగా దాన్ని మరింత విస్తరించి ఆసియాలోనే అతిపెద్ద టీహబ్గా నూతన భవనం నిర్మించి.. ఈ ఏడాది జూన్ 28న సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
శంకుస్థాపన: 2003లో.. ప్రారంభం: మే14, 2022
తెలంగాణలో బౌద్ధం పరిఢవిల్లింది. ఇప్పటికీ ప్రపంచం నలుమూలల నుంచి బౌద్ధభిక్షువులు రాష్ర్టానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు బుద్ధవనం ప్రాజెక్ట్ను 2003లో అప్పటి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూ.42 కోట్లతో ప్రారంభించాయి. నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ ఏర్పడ్డాక 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ను సందర్శించి బుద్ధవనానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా రూపొందించేందుకు రూ.25 కోట్లు మంజూరు చేశారు. మొత్తంగా రూ.100 కోట్ల వరకు ప్రాజెక్ట్ అభివృద్ధికి ఖర్చు చేశారు. నాగార్జునసాగర్లో 274 ఎకరాల్లో విస్తరించి ఉన్న బుద్ధవనం ప్రాజెక్ట్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధక్షేత్రంగా విరాజిల్లుతున్నది.
శంకుస్థాపన: 2019 జూన్27.. ప్రారంభం : దసరాకు
తెలంగాణకు తలమానికంగా అన్ని హంగులతో, ఆధునిక వసతులతో నూతన సచివాలయం వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్నది. దీర్ఘ చతురస్రాకారంలో జీ ప్లస్ 5 అంటే 6 అంతస్తుల్లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. దక్షిణ భారత సంప్రదాయంలో, మనోహరమైన కాకతీయుల నిర్మాణశైలిలో విలక్షణ భవంతిగా కొత్త సచివాలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. దసరా నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పనులకు శంకుస్థాపన: 2014, సెప్టెంబర్ 9
ప్రారంభం: జనవరిలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు..
హైదరాబాద్లో రవీంద్రభారతికి దీటుగా, రాష్ట్రంలో రెండో అతిపెద్ద పట్టణమైన వరంగల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. హయగ్రీవాచారి గ్రౌండ్లో 4.5 ఎకరాల విస్తీర్ణంలో 12,990 చదరపు మీటర్ల (1,39,823 చదరపు అడుగుల) వైశాల్యంలో దీనిని అత్యద్భుతంగా నిర్మిస్తున్నారు.
శంకుస్థాపన : 2016 మే 2
ప్రారంభం: జూన్ 21, 2019
సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. డిజైన్ చేయడం మొదలు.. నిర్మాణంలోనూ సీఎం కేసీఆర్ సునిశిత పరిశీలన, సుదీర్ఘ అధ్యయనం, చెక్కుచెదరని సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తున్నది కాళేశ్వరం ప్రాజెక్టు. రాష్ట్ర సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చడంలో కీలకభూమిక పోషిస్తున్నది. 18.25లక్షల కొత్త ఆయకట్టుకు నీరందించడంతోపాటు.. 18.46లక్షల స్థిరీకరించారు. ఇప్పటికే స్థీరికరణ లక్ష్యం నెరవేరుతుండటంతోపాటు, కొత్త ఆయకట్టు కింద 6 లక్షల ఎకరాలకు పైగా నీరందుతున్నది. మొత్తంగా 20 జిల్లాలకు లబ్ధి చేకూరుతున్నది. హైదరాబాద్ తాగునీటికి భరోసా లభించడంతోపాటు, పారిశ్రామిక అవసరాలు తీర్చనున్నది.
నిర్మాణం మొదలు.. 2019 మార్చి 9 ప్రారంభోత్సవం : 2020 సెప్టెంబర్ 25
తెలంగాణ ప్రభుత్వం రూ.184 కోట్లతో చేపట్టిన అద్భుత కట్టడం కేబుల్ బ్రిడ్జి. దుర్గం చెరువుపై సుమారు 233 మీటర్ల పొడవుగా నిర్మించిన ఈ బ్రిడ్జిని 2020 సెప్టెంబర్ 25న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్-మాధాపూర్ మధ్య అతి తక్కువ సమయంలో ప్రయాణించేందుకు రవాణా సౌలభ్యం కోసం దీనిని నిర్మించారు.
పనులకు శంకుస్థాపన: మే9,2018 మెదక్
తెలంగాణ ఏర్పాటు తరువాత పాలన సౌలభ్యం కోసం, పాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాలతో పాటు, పాత కలెక్టరేట్లను సైతం అన్ని హంగులతో తీర్చిదిద్దేందుకు నూతన కలెక్టరేట్లు నిర్మిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే నమూనాతో విశాలమైన, సహజ వెంటిలేషన్ ఉండేలా జిల్లా పరిపాలన భవనాలను తీర్చిదిద్దారు. మొత్తంగా 28 నూతన కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టారు. కొన్ని అందుబాటులోకి రాగా, మిగిలినవి ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి.
ఉమ్మడి పాలనలో కనుమరుగైన కులవృత్తులు తెలంగాణ స్వరాష్ట్రంలో జీవం పోసుకున్నాయి. గ్రామీణ వ్యవస్థ గాడిన పడ్డది. నాయీబ్రాహ్మణులు, రజకులు, విశ్వబ్రాహ్మణులు మొదలు మొత్తం 44 బీసీ ఆత్మగౌరవ భవనాలకు ఉప్పల్భగాయత్లో 80 ఎకరాల భూమిని కేటాయించారు. కోటి చొప్పున నిధులను మంజూరు చేశారు. ఇప్పటికే ఆదివాసీ, బంజారా భవన్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.
ఆధునిక రవాణా వ్యవస్థకు నిలువుటద్దంగా హైదరాబాద్ మెట్రో రైలు నిలుస్తున్నది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో మూడు కారిడార్లను నిర్మించారు. అందులో మియాపూర్-ఎల్బీనగర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోల్-రాయదుర్గం మధ్య అతి తక్కువ సమయంలో ప్రయాణించేందుకు చక్కటి రవాణా మార్గం. ఈ ప్రాజెక్టును మియాపూర్ వద్ద 2017 నవంబర్ 28న ప్రారంభించారు.
ప్రారంభం: డిసెంబర్ 25, 2021
రేతిబౌలి నుండి గచ్చిబౌలి వరకు భారీ ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఆరు లేన్లతో షేక్ పేట నుంచి ఫిలింనగర్ జంక్షన్, ఓయూ కాలనీ జంక్షన్, విస్పర్ వ్యాలీ జంక్షన్ వరకు నిర్మించిన షేక్పేట్ ఫ్లైఓవర్ నగరంలో రెండవ అతి పెద్ద ఫ్లై ఓవర్గా నిలుస్తున్నది. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే తర్వాత 2.8 కిలోమీటర్ల పొడవులో దీనిని నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్తో హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వెళ్లేందుకు వాహనదారులకు మహా ఉపశమనం లభించింది.