హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ అభద్రత, శ్రమదోపిడీకి నిలువెత్తు నిదర్శనమైన కాంట్రాక్ట్ వ్యవస్థకు చరమగీతం పాడుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏప్రిల్ నెల నుంచి క్రమబద్ధీకరించనున్నట్టు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో ప్రకటించారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నవారిని ఏప్రిల్ 1 నుంచి శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. దీంతో 11 వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. వీరంతా రాబోయే రెండు నెలల్లోనే శాశ్వత ఉద్యోగులుగా మారనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఉషోదయాన్ని నింపింది. ఈ నిర్ణయం పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల నేతలు జంగయ్య, సురేశ్ తదితరులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
వెతలు తీర్చిన కేసీఆర్
ఉమ్మడి రాష్ట్రంలో పకాంట్రాక్ట్ వ్యవస్థ పురుడుపోసుకున్నది. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులను 2000 సంవత్సరం నుంచి నియమిస్తున్నారు. వీరికి అరకొర వేతనాలు ఆలస్యంగా ఇచ్చేవారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల వెతలు తీర్చడంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 26న జీవో 16 జారీచేసింది. 2014 జూన్ 2కు ముందు పూర్తిస్థాయి కాంట్రాక్ట్ పద్ధతిలో నెలవారి పారితోషికాన్ని పొందుతున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు మార్గదర్శకాలు జారీచేసింది. హైకోర్టు కూడా సానుకూలంగా స్పందించడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కీలక అడ్డంకి తొలగిపోయింది. ఈ నేపథ్యంలోనే వివిధ ప్రభుత్వ శాఖలు కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపాయి. తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో ఏప్రిల్ నుంచి వీరంతా రెగ్యులర్ ఉద్యోగులుగా మారిపోనున్నారు.
మా జీవితంలో నవోదయం
2009లో కాంట్రాక్ట్ లెక్చరర్గా చేరా. అప్పట్లో మాకు రూ.8 వేల వేతనమే ఇచ్చేవారు. మిగతా ఉద్యోగాలు దక్కించుకోలే క.. స్వల్ప జీతంతో సరిపెట్టుకోలేక ఎన్నో అవస్థలు పడ్డాం. స్వరాష్ట్రంలో మాకు న్యాయం జరుగుతుందన్న సంపూర్ణ విశ్వాసంతో ఇన్నాళ్లూ వేచిచూశాం. ఎట్టకేలకు మా ఆశ, ఆశయం నెరవేరింది. మా జీవితాల్లో ఈ రోజు నవోదయం. – బుడిగె కొండయ్య, కాంట్రాక్ట్ ఇంగ్లిష్ లెక్చరర్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ జన్నారం, మంచిర్యాల జిల్లా
త్వరలో శాశ్వత ఉద్యోగులం
కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించడం చరిత్రాత్మకం. ఉద్యోగ భద్రత లేకుం డా తాత్కాలిక ఉద్యోగులుగా కొనసాగిన మాకు భరోసా దొరికింది. వేతనాల పెంపుతోపాటు పీఎఫ్, ఈహెచ్ఎస్ వంటి సామాజిక భద్రతా పథకాలు కూడా దక్కుతాయి. మాకు సహకరించిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డికి ధన్యవాదాలు. – సీహెచ్ కనకచంద్రం, ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ చైర్మన్
ప్రభుత్వానికి ధన్యవాదాలు
తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరిస్తామన్న హామీని నిలబెట్టుకుని 11 వేల మంది ఉ ద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని నెరవేర్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. మాకు ఈ రోజే నిజమైన దసరా. దీపావళి. మా చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
– మాచర్ల రామకృష్ణగౌడ్, తెలంగాణ ఇంటర్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు
బడుగు,బలహీన వర్గాలకు ఊతం
అన్నివర్గాల సంక్షేమంతోపాటు విద్య, వైద్యం, వ్యవసా యం వంటి రంగాలకు భారీగా నిధులు కేటాయించి బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వమని నిరూపించింది. మన బడ్జెట్ దేశానికి మాడల్గా నిలుస్తుంది. మహిళలు ఆర్థికంగా మరింత ప్రగతి సాధించేందుకు బడ్జెట్లో పెద్దపీట వేయడం సంతోషకరం. విద్యారంగానికి (ఉన్నత, ప్రాథమిక) అధికంగా నిధులు కేటాయించి, యూనివర్సిటీల అభివృద్ధికి ప్రత్యేకంగా కేటాయింపులు జరపడం శుభసూచకం.
–శ్రీకాంత్గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కేసీఆర్ రైతు పక్షపాతి
మోదీ బడ్జెట్కు, కేసీఆర్ బడ్జెట్కు ఎంతో తేడా ఉన్నది. సీఎం కేసీఆర్ వ్యవసాయానికి సింహభాగం నిధులు కేటాయించి రైతు పక్షపాతి అనిపించుకొన్నారు. తెలంగాణ బడ్జెట్ సబ్బండ వర్ణాలకు సముచిత ప్రాధాన్యం కల్పించింది. ఎనిమిదిన్నరేండ్లుగా సామాన్యులు, రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. తెలంగాణ బడ్జెట్ అన్నిరంగాలకు ఊతమిచ్చేలా ఉన్నది.
– కాసర్ల నాగేందర్రెడ్డి, బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు
వైద్యానికి రికార్డు కేటాయింపులు
వైద్యారోగ్య శాఖకు రికార్డుస్థాయిలో రూ.12,161 కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు. ఇందుకు కృషి చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు. తాజా కేటాయింపులు ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా మరింత దోహదం చేస్తాయి. వైద్యరంగంలో మరిన్ని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాం. సీఎం కేసీఆర్ ఆశయాలకనుగుణంగా ఆరోగ్య తెలంగాణ లక్ష్యం సాకారం చేస్తాం.
–గడల శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు
దళితబంధుకు ప్రాధాన్యం
దళితబంధు పథకానికి భారీగా నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు. విడుదల చేసిన నిధుల్లో కోత విధించకుండా ప్రభుత్వమే పర్యవేక్షించాలి. నియోజకవర్గానికి గతంలో కేటాయించిన లబ్ధిదారుల సంఖ్యను ఇంకా పెంచాలి. నిరుపేదలైన దళితులకు ఈ పథకం అందేలా చూడాలి. దళితబంధు కోసం ప్రతిపాదించిన బడ్జెట్ను ఆ పథకం కోసమే ఖర్చు చేయాలి.
–వంగపల్లి శ్రీనివాస్ మాదిగ