Bandi Sanjay | హైదరాబాద్ ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. తొలి రోజు, మలి రోజు ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ బీజేపీ నేతలు నానా హంగామా సృష్టించారు. ఆ నె పం ప్రభుత్వంపై నెట్టడానికి విఫలయత్నం చేశారు. ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్నట్టు ఏదో చేద్దామని ప్రయత్నించిన బీజేపీ నేతలు చివరకు భంగపడాల్సి వచ్చింది. పేపర్ అవుటైన కేసులో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కావటంతో ఒక్కసారిగా కుట్రలన్నీ సద్దమణిగాయి.
తెలుగు, హిందీ పేపర్ల అవుట్ తర్వాత మిగతా పరీక్షలన్నీ సజావుగా సాగిపోయాయి. దీన్నిబట్టి అర్థమయ్యే విషయం ఒకటే. బండి సంజయ్ అరెస్ట్ తర్వా త ఎలాంటి గందరగోళం ఏర్పడలేదు.. అంటే లీకేజీ డ్రామా వెనుక ఎవరున్నారనేది స్పష్టమైనట్టు అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మైలేజీ కోసం లీకేజీ డ్రామాలాడి.. పథకం బెడిసికొట్టడంతో ఏం చేయాలో పాలుపోని బీజేపీ నేతలు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుమిట్టాడుతున్నారు. తప్పించుకోవటానికి తలోరకంగా మాట్లాడుతున్నారు.
రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కూడా ప్రభుత్వాన్ని బదనాం చేసి లాభపడాలని చూసింది బీజేపీ. అక్కడ తమ పప్పులుడకకపోవటంతో పదో తరగతి ప్రశ్నపత్రాలను అవుట్ చేయటానికి తెగించింది. ఇది కేవలం రాజకీయ అవసరాల కోసం బీజేపీ అమలు చేసిన రాజకీయ ఎత్తగడ అన్నది ఇప్పుడు తేటతెల్లమైంది. రాష్ట్రంలో పశ్నపత్రాలు లీకవుతున్నాయి. అసమర్థ ప్రభుత్వం కొనసాగుతున్నది, దీనిని దింపాలి అని ఆ పార్టీ నేతలు పిలుపునివ్వటమే కుట్రగా వెల్లడైంది. ప్రభుత్వంపై ప్రజల్లో, విద్యార్థుల్లో వ్యతిరేకతను కల్పించి, అలజడి రేకెత్తించాలనే దుస్సాహసానికి బీజేపీ ఒడిగట్టిందన్న విషయం దీనితో నిరూపితమైంది. ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యల వల్ల మొత్తానికి పరీక్షలు సజావుగా ముగిశాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. పేపర్ అవుటైనప్పుడు ఒకలా.. తామే నిందితులుగా తేలిన తర్వాత మరోలా మాట్లాడి బీజేపీ నేతలే ప్రజల ముందు దోషులుగా నిలిచారని సర్వత్రా భావిస్తున్నారు.
(తేదీ ఏప్రిల్ 3, 4తేదీల్లో మీడియాతో బండి సంజయ్)
రాష్ట్రంలో పదో తరగతి పేపర్లు లీకవడం అత్యంత దురదృష్టకరం. కేసీఆర్ ప్రభుత్వంలో పరీక్షల లీకేజీ సర్వసాధారణంగా కనిపిస్తున్నది. తెలంగాణలో పరీక్షలు వస్తే లీకేజీల జాతర నడుస్తున్నది. లీకేజీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.
(జైలు నుంచి బండి సంజయ్ విడుదలైన తర్వాత ఏప్రిల్ 6న కరీంనగర్ జైలు వద్ద)
ఎగ్జామ్ పేపర్ను ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధం. ఎవరన్నా హిందీ పేపర్ను లీక్ చేస్తరా? ఉదయం 9:30కి పరీక్ష ప్రారంభమైన తర్వాత 10:30 గంటలకు పేపర్ బయటికొచ్చింది. ఎస్సెస్సీ గ్రూపుల్లోకి వెళ్లింది.. టీవీల్లో వచ్చింది.
(ఏప్రిల్ 5న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు )
తెలుగు పేపర్ లీకైంది. సెల్ఫోన్లను అనుమతించకపోతే, గేటు బయటే ఉంచితే హిందీ పేపర్ బయటికి వచ్చేదికాదు కదా. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేపర్లు లీక్కాకుండా చర్యలు తీసుకోవాలి. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాలేకుండా విద్యార్థా, టీచరా అన్న తేడాల్లేకుండా లీకేజీకి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలి. పేపర్ లీక్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
(ఏప్రిల్ 6న రఘునందన్రావు)
జరిగింది పేపర్ లీకేజీ కాదు. ఉదయం 11:24 గంటలకు బండి సంజయ్ గారి సెల్ఫోన్కు పేపర్ వచ్చింది. పరీక్ష ప్రారంభానికి ముందు పేపర్ బయటికొస్తే పేపర్ లీకయినట్టు. పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత పేపర్ బయటకు వస్తే లీకేజీ ఎట్లయితది. దీనిని లీకేజీ ఎట్లంటరు? పరీక్ష ప్రారంభమైన 2 గంటల తర్వాత విద్యార్థులంతా బయటికొస్తరు. ఆటోమెటిక్గా పేపర్ బయటికొచ్చినట్టే.
(ఏప్రిల్ 6న బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్)
పదో తరగతి పరీక్షపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. టీఎస్పీఎస్సీ సహా అన్ని పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నరు.
(తేదీ 10 -4-2023 పోలీసుల విచారణ తర్వాత ఈటల రాజేందర్)
పేపర్ లీకేజీ పచ్చి అబద్ధం. ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభమైన తర్వాత 11 గంటలకో, 11:30 గంటలకో పేపర్ బయటికి వస్తే దానిని లీకేజీ అనరు. ఇది పచ్చి అబద్ధం. ఏ సెంటర్ల నుంచి పేపర్ బయటికి వస్తే ఆ సెంటర్లో మాల్ ప్రాక్టీస్ అంటారే తప్ప లీకేజీ అనరు.
ఇవి బీజేపీ ముఖ్య నేతలు మాటలు. ముందు లీకన్నరు.. ప్రభుత్వాన్ని గద్దె దించాలని గొంతుచించుకున్నరు. ఆ తర్వాత కుట్రలు. క్షుద్ర రాజకీయాలు బట్టబయలు కావడం.. బండి సంజయ్ అరెస్ట్కు దారితీయడంతో ఇప్పుడు నాలుక్కరుచుకుని లేదు లేదు.. ఇది లీకేజీ కాదు.. మాల్ ప్రాక్టీస్ అంటున్నరు. లీకేజీ అబద్ధమని ఇప్పుడు గాయిగాయి చేస్తున్నరు. లీకుల వెనుక ఉన్నది తమ పార్టీయే కావడంతో కవరింగ్ చేసుకునేందుకు ఇది లీకేజీ కాదని ఆ పార్టీ నేతలే ఇప్పుడు బుకాయిస్తున్నరు.