అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ సీటు. దాని పరిధిలో 4అసెంబ్లీ నియోజక వర్గాల (సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి)లోని విద్యుత్తు వినియోగదారులు పాల్గొన్న ఎన్నిక. అదే సెస్ (సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సొసైటీ) ఎన్నిక. అనుమానపడడానికో, ఆరోపణలు చేయడానికో, నెపం నెట్టడానికో.. అదేమీ ఈవీఎంలతో జరిగిన ఎన్నిక కాదు. ఫక్తు బ్యాలెట్ పేపరుతో జరిగిన ఎన్నిక. ఈ ఎన్నికలో 15 సీట్లకు పోలింగ్ జరిగితే మొత్తం 15 సీట్లనూ బీఆర్ఎస్సే గెలుచుకుంది. ఇదీ తెలంగాణలో గులాబీకున్న ఆదరణ.
ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం బీజేపీ, దాని రాష్ట్ర అధ్యక్షుడు వేయని పాచికలేదు. చేర్చుకోని చేరికలేదు. డబ్బు మంచినీళ్ల కంటే అధ్వానంగా పారించారు. అయినా ఇక్కడి ప్రజలు గులాబీకే పట్టం కట్టి తెలంగాణ ఎటువైపు ఉందో మరోసారి చాటిచెప్పారు. సాంకేతికంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పేరు మార్చుకున్న తర్వాత జరిగిన తొలిఎన్నిక ఇది. పేరేదైనా.. సారు, కారుదే జోరని ఈ ఎన్నిక రుజువుచేసింది. ఎవడు ఎంత ఒర్రినా.. ఎన్ని యాత్రలు చేసి నా.. ప్రజలను రెచ్చగొట్టినా.. బీఆర్ఎస్ను ఎంత తిట్టినా.. నానా యాగీ చేసినా.. కోట్ల రూపాయలతో ప్రలోభపెట్టినా.. తెలంగాణ ఇప్పటికీ, ఎప్పటికీ బీఆర్ఎస్దే. సెస్ ఎన్నికల ఫలితాలే దీనికి సూచిక. బూతుల బండికి మిగిలేది ఆయాసమే తప్ప జనాదరణ కాదని ఈ ఎన్నిక తేల్చిచెప్పింది.
ఇదే కాదు.. ఇక ముందు తెలంగాణలో జరిగే ఏ ఎన్నికలోనైనా గెలుపు గులాబీదే. ఇది తాజాగా సెస్ ఎన్నిక ఇచ్చిన సందేశం.
రాజన్న సిరిసిల్ల, (నమస్తే తెలంగాణ)/వేములవాడ, డిసెంబర్ 26: బీఆర్ఎస్ విజయభేరి మోగించింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత మొదటిసారి జరిగిన సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సొసైటీ (సెస్) ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసింది. సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలోని 15 డైరెక్టర్ స్థానాలకుగాను అన్ని స్థానాల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. జాతీయ పార్టీగా రూపుదిద్దుకున్న తర్వాత తొలి గెలుపు కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొన్నది. ఈ ఎన్నికల్లో వార్ వన్సైడ్ అయింది. శనివారం పోలింగ్ జరుగగా, 87,130 మంది ఓటర్లకు గాను, 73,189 మంది (84 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. 202 పోలింగ్ కేంద్రాల్లోని 252 బూత్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్లను తెరిచి వేములవాడ, సిరిసిల్ల, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల వారీగా లెక్కించారు. మొదటగా రుద్రంగి, వీర్నపల్లి ఫలితాలు రాగా, మిగతా 12 స్థానాలకు సంబంధించిన ఫలితాలను రాత్రి 9 గంటల వరకు వెల్లడించారు. వేములవాడ రూరల్ డైరెక్టర్ స్థానానికి రీకౌంటింగ్ నిర్వహించి, రాత్రి 11 గంటల వరకు ఫలితం వెల్లడించారు. కాగా, సెస్ చైర్మన్ ఎన్నికను మంగళవారం నిర్వహించనున్నారు. గత సెస్ ఎన్నికల్లో 11 డైరెక్టర్ స్థానాలు ఉండగా మొత్తం అప్పడు టీఆర్ఎస్ పార్టీనే గెలిచింది.
అభివృద్ధికే ఓటు
ఇతర జిల్లాల నుంచి వచ్చిన బీజేపీ నేతల ప్రయత్నాలు ఇక్కడ పనిచేయలేదు. ‘ఆశీర్వదించండీ, అభివృద్ధిని చూసి ఓటెయ్యండి’ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తితో బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు అండగా నిలిచారు. ఉమ్మడి రాష్ట్రలో కరెంటు కోతలను నిరసిస్తూ రైతులు, చేనేత కార్మికులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. వీరికి నాణ్యమైన కరెంటు ఇచ్చేలా చేశారు. ప్రతి రెండు, మూడు గ్రామాలకో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుచేశారు. రూ.100 కోట్లతో పెద్దూరులో 220 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా లోవోల్టేజీ సమస్యలు తీరాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు మళ్లీ గెలిస్తేనే సెస్ మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలు, వినియోగదారుల్లో నమ్మకం పెరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి స్థానం నుంచి గెలిచిన చిక్కాల రామారావును అభినందిస్తున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చీటి నర్సింగరావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి తదితరులు
బీఆర్ఎస్ సంబురాలు
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఘనవిజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు జిల్లా అంతటా సంబురాలు జరుపుకొన్నారు. పటాకులు కాల్చి, కేక్లు కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు జరుపుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, చేనేత, జౌళిశాఖ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, పట్టణ శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కౌంటింగ్ కేంద్రం ఎదుట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
వికసించని కమలం
సెస్ ఎన్నికల్లో 6 నుంచి 7 స్థానాలు వస్తాయని బీజేపీ అంచనా. ఇతర జిల్లాల ముఖ్య నేతలను మండలానికి ఒకరిని ఇన్చార్జిగా నియమించి డబ్బు పంపిణీచేశారు. సిరిసిల్ల టౌన్వన్లో, చందుర్తి, రుద్రంగి, వేములవాడ, సిరిసిల్ల టౌన్-2, కోనరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో గెలుస్తున్నామంటూ ముందే క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎన్నికల్లో ప్రచార పటాటోపాన్ని ప్రజలు పట్టించుకోలేదు. అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడంతో బీజేపీ నేతలంతా నిరాశలో ఉన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి వచ్చి చెప్పినా ఓటర్లు కేర్ చెయ్యలేదు.