హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): దశాబ్ది ఉత్సవాలను పల్లెపల్లెనా వైభవంగా నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఉత్సవాల నిర్వహణపై మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), జడ్పీ సీఈవోలు, డీఆర్డీవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆసరా పింఛన్ల వంటి పథకాల ప్రాధాన్యాన్ని తెలిపేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని 10న కొత్త జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలను అందంగా అలంకరించి ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. 13న మహిళా దినోత్సవంలో మహిళలతోపాటు డ్వాక్రా సంఘాలు, వీవోఏలు, సెర్ప్ ఉద్యోగులను భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా మాట్లాడుతూ.. ఉత్సవాలను మన గురించి మనం చెప్పుకునే మంచి అవకాశంగా మలచుకోవాలని పేర్కొన్నారు.
ఘనంగా మంచినీళ్ల పండుగ: స్మితా సభర్వాల్
జూన్ 18న నిర్వహించే మంచినీళ్ల పండుగ కోసం ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కార్యదర్శి, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, అన్ని జిల్లాల ఎస్ఈలతో దశాబ్ది ఉత్సవాలపై ఆమె సమీక్ష నిర్వహించారు.
సాగునీటిపై డాక్యుమెంటరీ ప్రదర్శన:రజత్కుమార్
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 7న సాగునీటి దినోత్సవం, 8న చెరువుల పండుగను ఘనంగా నిర్వహించాలని సాగునీటి పారుదల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ 9 ఏండ్ల కాలంలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి, కాళేశ్వరం ప్రాజెక్టు డాక్యుమెంటరీలను సాగునీటి దినోత్సవం రోజున ప్రదర్శించాలని సూచించారు.