హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అప్పులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఖండించారు. బడ్జెట్కు.. రుణానికి తేడా తెలియనివారు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండడం విషాదకరమని పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ 2014లో రూ.60 లక్షల కోట్లు ఉంటే దాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అప్పుగా చిత్రీకరించటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు పెరుగడాన్ని రుణంగా భావించిన నిర్మలా సీతారామన్ తెలంగాణపై తనకు కనీస పరిజ్ఞానం లేదని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రాంతానికి ఏమిచ్చారో కనీసం ప్రకటించకపోవడం కేంద్రానికి తెలంగాణపై ఉన్న వివక్షకు నిదర్శమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారనే భయంతోనే కేంద్రంలోని మంత్రులు తెలంగాణపై విషప్రచారాలు, వక్రభాష్యాలు చేస్తున్నారని విమర్శించారు.