కరీంనగర్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్తోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉన్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అన్ని పార్టీలు ఏకమై టీఆర్ఎస్పై దాడులకు దిగుతున్నాయని, తిప్పికొట్టేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగిన టీఆర్ఎస్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తోపాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. ‘ప్రభుత్వపరంగా మన పాత్ర మనం నిర్వహించి రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యంగా ముందు కు సాగాలి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ను బతికించుకోవాలని సూచించారు. కొందరు కావాలనే తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ఎస్పై బురదజల్లుతున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాకముందు ఎలా ఉన్నది? ఇప్పుడు ఎలా ఉన్నదో ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిని సాధించి, పచ్చబడిన తర్వాత మళ్లీ ఆంధ్రోళ్ల నుంచి ముప్పు కనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్టాన్ని దోచుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. చంద్రబాబు మళ్లీ కుట్రలు చేస్తున్నారని, కొందరు పాదయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. షర్మిల, కేఏ పాల్, చంద్రబాబు వీళ్లంతా ఎవరని, వేరేవాళ్ల చేతికి అధికారం పోతే రాష్ట్రం అంధకారం అవుతుందని తెలిపారు. కేసీఆర్ లేకపోతే రాష్ట్రం వచ్చేదా? నీళ్లు, నిధులు వచ్చేవా? నియామకాలు జరిగేవా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్తోనే తెలంగాణ గడ్డకు భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాల విషప్రచారాన్ని తిప్పికొట్టాలి: వినోద్
రాష్ట్రం, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ ఏకైక ఎజెండాగా పెట్టుకున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో ఆ పార్టీ చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గులాబీ జెండా నీడలోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రత్యర్థులపై యుద్ధం కొనసాగించాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. యువతను పక్కదారి పట్టించేందుకు బీజేపీ నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయ, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణ, ఆరెపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, మేయర్ వై సునీల్రావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.