న్యూఢిల్లీ, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గంగారాం అహిర్ అంగీకరించినట్టు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం తెలిపారు. కులగణన చేపట్టాలని కోరుతూ గురువారం ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషన్ కార్యాలయంలో గంగారాంతో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను దృష్టికి తీసుకెళ్లగా అవి బాగున్నాయని గంగారాం కితాబిచ్చారని వకుళాభరణం తెలిపారు.
ఇలాంటి పథకాలు దేశంలోనే ఎక్కడాలేవని అంగీకరించారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పథకాలు అమలు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందించినట్టు పేర్కొన్నారు. అంతకుముందు వకుళాభరణాన్ని గంగారాం శాలువాతో సత్కరించా రు. కుల గణన వల్ల బీసీలకు జరిగే మేలుతోపాటు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్కు ఉన్న అడ్డంకులు తొ లగిపోతాయని వకుళాభరణం పేర్కొన్నారు.