Swachh Bharat | స్వచ్ఛ భారత్ అవార్డులో మరోసారి తెలంగాణ సత్తాచాటింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్రం ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో రెండు వేర్వేరు విభాగాల్లో.. తొలి మూడుస్థానాలతో నెంబర్ వన్గా నిలిచింది. అక్టోబర్ – డిసెంబర్-2022 త్రైమాసికానికి స్వచ్ఛ భారత్ ఎంపిక చేసిన రెండు విభాగాల్లోనూ అవార్డులు వరించాయి. స్టార్ త్రీ విభాగంలో తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా, జగిత్యాల జిల్లాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కేరళలోని కొట్టాయం మూడో స్థానంలో నిలిచింది. స్టార్ ఫోర్ విభాగంలో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, రెండోస్థానంలో మధ్యప్రదేశ్లోని భోపాల్, తెలంగాణలోని పెద్దపల్లికి మూడోస్థానం దక్కింది. గతంలోనూ స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రకటించే ప్రతి అవార్డుల్లోనూ తెలంగాణ మొదటి మూడు స్థానాల్లో నిలుస్తూనే ఉంది.
స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభినందించారు. అవార్డులు రావడంలో రాష్ట్రస్థాయిలో కార్యదర్శి నుంచి గ్రామస్థాయి సిబ్బంది అందరి కృషి ఉందన్నారు. ఈ సందర్భంగా హన్మకొండలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా.. అవార్డులు ఇస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి వంటి వినూత్న
కార్యక్రమాలతోనే అవార్డులు దక్కుతున్నాయన్నారు. నిధులు, విధులు ఇచ్చి స్థానిక సంస్థలను బలోపేతం చేస్తున్నారన్నారు.
అలాగే ముఖరా కే గ్రామ సర్పంచ్ మీనాక్షికి జాతీయ అవార్డు వచ్చినందుకు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కే గ్రామానికి, సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శి, వార్డు సభ్యులు, సిబ్బంది కృషి, ప్రజల సహకారంతో అవార్డులు రావడం కొత్తేమి కాదన్నారు. దేశంలోనే నంబర్ వన్ గ్రామంగా అభివృద్ధిలో నిలిచిందని ప్రశంసించారు. బహిరంగ మల మూత్ర విసర్జన రహిత గ్రామంగా అవార్డు గెలిచిందన్నారు. కేంద్ర ప్రకటించే అవార్డుల్లో గ్రామం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి మీనాక్షి చేతుల మీదుగా అందుకోనుండడం సంతోషించదగ్గ విషయమన్నారు.