Telangana | హైదరాబాద్ : శాసనసభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, అధికారులకు చెల్లించే పారితోషికాన్ని ఎన్నికల సంఘం ఖరారు చేసింది. ఎన్నికల నిర్వహణపై పోలింగ్ అధికారులకు మూడుసార్లు శిక్షణ ఇచ్చారు. పోలింగ్ సందర్భంగా రెండు రోజులు విధులు నిర్వహించారు. ఈ ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బందికి పారితోషికానికి అదనంగా భోజనం ఖర్చులు కేటాయించారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే వారికి ప్రత్యేకంగా పారితోషికం చెల్లిస్తారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారి మరో ఇద్దరు ఇతర పోలింగ్ అధికారులను నియమించారు.
ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారికి రూ. 1550, ఇతర పోలింగ్ అధికారులకు రూ. 900, కౌంటింగ్ సూపర్వైజర్కు రూ. 1200, కౌంటింగ్ అసిస్టెంట్కు రూ. 900, అటెండర్కు రూ. 400, ఐడెంటిఫికేషన్ అధికారికి రూ. 500, ఓటరు ఫెసిలిటీస్ సెంటర్ ఇంచార్జికి రూ. 400, సూక్ష్మ పరిశీలకుడికి రూ. 1,150 చొప్పున పారితోషికం చెల్లించనున్నారు. సెక్టోరియల్ అధికారికి రూ. 7,500, వీడియో సర్వేలెన్స్ టీ, వీడియో వింగ్ టీంలకు రూ. 22 వేలు, ప్లయింగ్ స్క్వాడ్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీలకు రూ. 16,600, ఎన్నికల వ్యయ పర్యవేక్షణ బృందానికి రూ. 10,600 చొప్పున చెల్లించనున్నారు.