హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో తిండికి లోటు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అహరహం కృషిచేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరికీ ఆహారభద్రతను కల్పించడంలో భాగంగా కిలో ఒక్క రూపాయికే ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున ‘ఆహార భద్రతాకార్డు (రేషన్ కార్డు)’ ద్వారా నాణ్యమైన బియ్యాన్ని రాష్ట్రప్రభుత్వం అందిస్తున్నదని చెప్పారు. రేషన్ కార్డు కలిగిన మొత్తం 87,41,000 కుటుంబాల్లోని 2,79,27,000 (రాష్ట్ర జనాభాలో 72%) మందికి కేవలం రూపాయికి కిలో చొప్పున 20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సాలీనా పంపిణీ చేస్తున్నదని పేర్కొన్నారు. ఇందుకుగానూ కిలో ఒకింటికి రూ.28.24 పైసల చొప్పున ప్రతి ఏటా రూ.2,088 కోట్ల సబ్సిడీని భరిస్తున్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు సన్నబియ్యాన్ని అందిస్తూ చిన్నారులకు ఆహార భద్రతను ప్రభుత్వం కల్పిస్తున్నదని సీఎం కేసీఆర్ వివరించారు. రేషన్ కార్డుదారులు ఎకడి నుంచైనా రేషన్ తీసుకొనేలా రేషన్ పోర్టబిలిటీ రూపొందించిందని తెలిపారు. తద్వారా తెలంగాణ పౌరులు రాష్ట్రంలో ఎకడున్నా ఆహార భద్రత లభించేలా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిందని సీఎం కేసీఆర్ తెలిపారు. జూన్ 7 సోమవారం ‘ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం’ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఆహార భద్రతను సాధించి ఆపై దేశానికే ఆహార భరోసా కల్పించే స్థాయికి చేరుకున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు.
రైస్బౌల్ ఆఫ్ ఇండియా
ఉమ్మడిరాష్ట్రంలో ఆహారంకోసం ఎంతగానో అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ కృషిని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. సొంతరాష్ట్రం ఏర్పడిన తర్వాత అనతికాలంలో రెండు పంటలకు నీరందించి.. రెండుకోట్ల ఎకరాల మాగాణగా తెలంగాణను తీర్చిదిద్దుకొన్నామని సీఎం తెలిపారు. దాదాపు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలోకి దూసుకుపోతున్నదని తెలిపారు. ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ వ్యవసాయం రూపుదిద్దుకోవడం పట్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు.
సురక్షితమైన అహారం ఇచ్చేందుకు చర్యలు
ప్రజలకు మాంసం చేపలు వంటి స్వచ్ఛమైన పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్పలితాలను ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. బయటి నుంచి దిగుమతి చేసుకోనవసరం లేకుండా చేపల పెంపకం, గొర్రెల పెంపకం వంటి పథకాలను అమలు పరుస్తూ, కూరగాయలు పండ్లు తదితర పోషకాలను అందించే ఆహార ఉత్పత్తుల సాగును ప్రోత్సహిస్తున్నదన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు సురక్షితమైన, భద్రతతో కూడిన ఆహారం లభిస్తున్నదని సీఎం తెలిపారు. కలుషితమైన ఆహారం దరి చేరకుండా కల్తీ మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని గుర్తుచేశారు. కల్తీ విత్తనాలు, ఎరువులు సహా ఆహార పదార్థాల కల్తీని ప్రభుత్వం ఉకుపాదంతో అణచివేసి ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించే చర్యలు చేపడుతున్నదని సీఎం తెలిపారు. రోజురోజుకు పెరిగిపోతున్న షుగర్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ‘తెలంగాణ సోనా’ పేరుతో షుగర్ ఫ్రీ వరి వంగడాలకు రూపకల్పన చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ వంగడాలను ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రజల ఆరోగ్యంకోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకొంటున్నదని సీఎం అన్నారు.
ధాన్యం ఉత్పత్తిలో ప్రథమ స్థానం
ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం వంటి వినూత్న ప్రాజెక్టుల ద్వారా సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో రెండు కరోనా సందర్భాల్లోనూ తెలంగాణ వ్యవసాయం అద్భుత ఫలితాలనిచ్చిందని సీఎం తెలిపారు. కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా అన్ని వ్యాపారాలు మూతపడిన పరిస్థితుల్లో కూడ తెలంగాణ రైతులు పండించిన పంట దేశానికి ఆహార భరోసాను కల్పించడం గొప్ప విషయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని, నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల సాగునీరు, తాగునీరు లేక తెలంగాణ అల్లాడిందని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటైన అనంతరం ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువులను పటిష్ఠ చేసుకొని, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించుకొని ధాన్యం ఉత్పత్తిలో నేడు దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా ఎదుగుతుండటం తెలంగాణ సమాజం గర్వపడే సందర్భమని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతి ఏటా రూ.45 వేల కోట్లతో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ప్రజలకు ఆహార భద్రతతోపాటు సామాజిక జీవన భద్రత కూడా ప్రభుత్వం కల్పిస్తున్నదని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ధాన్యం కొనుగోళ్లు 82 లక్షల టన్నులు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు లక్ష్యాన్ని మించి జరిగినట్టు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సోమవారం వరకు 82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో రైతులు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మొత్తం ధాన్యం కొనుగోలుచేస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 12.50 లక్షల మంది రైతుల నుంచి సుమారు రూ.16వేల కోట్ల విలువైన 82 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. మరో 4-5 లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నదని చెప్పారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో వీలైనంత త్వరగా కొనుగోళ్లు ముగించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు 8లక్షల మందికి 40 లక్షల టన్నుల ఉచిత బియ్యం పంపిణీ చేసినట్టు మారెడ్డి తెలిపారు.