హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మల్లినాథసూరి సంస్కృత వర్సిటీ ఏర్పాటుకు చకచకా అడుగులు పడుతున్నాయి. మహాభాష్యకర్త, మహామహోపాధ్యాయ మల్లినాథ సూరి పేరిట సంస్కృత వర్సిటీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ శనివారం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన లేఖ ప్రభుత్వంనుంచి అందగానే వర్సిటీ ఏర్పాటుపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. ఉస్మానియా వర్సిటీతోపాటు సంస్కృత భాషపై పట్టున్న నిపుణులు, ఈ భాషపై అధ్యయనం చేసిన వారితో కమిటీని నియమించాలని యోచిస్తున్నారు. ఈ త్రిసభ్య కమిటీ కొల్చారంలో పర్యటించి, స్థల పరిశీలన జరుపనున్నది. కోర్సుల నిర్వహణపైనా ప్రభుత్వానికి నివేదికను అందజేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా సంస్కృత యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ జీవో జారీచేస్తుంది. దీంతో కొత్త వర్సిటీ మనుగడలోకి వస్తుంది. వేద భాష అయిన సంస్కృతాన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు జాతీయంగా 13 సంస్కృత యూనివర్సిటీలు కృషిచేస్తున్నాయి. వీటిలో మూడు సెంట్రల్ వర్సిటీలు కాగా, ఒకటి డీమ్డ్ యూనివర్సిటీ, మిగతా 8 స్టేట్ యూనివర్సిటీ హోదాలో కొనసాగుతున్నాయి. ఈ వరుసలో మల్లినాథ సూరి వర్సిటీ సైతం చేరనున్నది. ఇవి కాకుండా మరో 5 సంస్కృత పీఠాలు ఉన్నాయి.
అన్ని వర్సిటీలకు కేరాఫ్ తెలంగాణ
సంస్కృత వర్సిటీ ఏర్పాటుతో తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్గా మారిపోనున్నది. రాష్ట్రంలో విద్యార్థుల అభిరుచుల మేరకు అన్ని రకాల చదువులు, అన్ని రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. దేశంలోనే తొలి సాంకేతిక విశ్వవిద్యాలయంగా జేఎన్టీయూ రాష్ట్రంలో ఏర్పాటయ్యింది. ఇదే వరుసలో దేశంలోనే తొలి సార్వత్రిక విద్యనందించే (దూరవిద్య) విశ్వవిద్యాలయంగా బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రసిద్ధికెక్కింది. వీటితోపాటు ఉర్దూ, తెలుగు, ఇంగ్లిష్సహా ఇతర విదేశీ భాషల కోసం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు సేవలందిస్తున్నాయి. తాజా వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తంగా 31 వర్సిటీలు ఉన్నాయి. వీటిలో మూడు సెంట్రల్ యూనివర్సిటీలు, జాతీయస్థాయిలో ప్రాధాన్యత గల విద్యాసంస్థలు 4 ఉన్నాయి. మరో 15 రాష్ట్రస్థాయి వర్సిటీలు, అసెంబ్లీ చట్టం ద్వారా ఏర్పాటైన మరో విద్యాసంస్థ, ఒక ఓపెన్ వర్సిటీ, నాలుగు ప్రైవేట్ వర్సిటీలు, ఒక ప్రభుత్వ డీమ్డ్ వర్సిటీ, 2 ప్రైవేట్ డీమ్డ్ వర్సిటీలు సేవలు అందిస్తున్నాయి. వీటన్నింటిలో విభిన్న కోర్సులు అందుబాటులో ఉండగా, అనేక రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు తెలంగాణలో చదువుకొనేందుకు ముందుకొస్తున్నారు.
ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తాం
మల్లినాథ సూరి సంస్కృతంలో గొప్ప రచనలు చేయడమేకాకుండా పలు రచనలను అనువాదం చేసిన గొప్ప పండితుడు. ఆయన పేరుతో వర్సిటీ ఏర్పాటుకావడం రాష్ర్టానికి గర్వకారణం. జాతీయంగా మల్లినాథ సూరికి గొప్ప గుర్తింపు వస్తుంది. ఈ వర్సిటీ ఏర్పాటుతో 12-13 శతాబ్దంనాటి అనేక సంస్కృత కావ్యాలపై నేటితరం అధ్యయనం చేసే వీలు కలుగుతుంది. వాటిని సమకాలీన సమాజానికి ఉపయోగపడేలా రిసెర్చ్ చేసేందుకు దోహదపడుతుంది. సంస్కృత యూనివర్సిటీపై ప్రభుత్వం నుంచి మాకు సమాచారం అందింది. మా వైపు నుంచి పక్రియను ప్రారంభించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా వర్సిటీ ఏర్పాటుకు మా వంతుగా సహకరిస్తాం.
– ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్
సీఎం కేసీఆర్కు శత సహస్ర వందనాలు
తెలంగాణకు మకుటాయమానమై గుర్తింపునకు నోచుకోని మహా ఉపాధ్యాయుడు మల్లినాథ సూరి పేరిట సంస్కృత యూనివర్సిటీని ఏర్పాటు చేయడం స్వాగతించాల్సిన విషయం. ఇందుకు చొరవ తీసుకొన్న సీఎం కేసీఆర్కు శత సహస్ర వందనాలు. ఈ రోజు సంస్కృత కావ్యాలు ప్రాచుర్యంలోకి వచ్చాయంటే మల్లినాథ సూరి వ్యాఖ్యానాలే మూలం. ఇలాంటి పండితుడు ప్రాచుర్యంలోకి రావాలని చాలా ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలో ఆయన పేరుతో వర్సిటీని ఏర్పాటు చేయడం శుభ పరిణామం.
-ప్రొఫెసర్ నీలకంఠం, సంస్కృత అకాడమీ డైరెక్టర్