హైదరాబాద్ : ఇప్పటికే దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ, బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లోనూ మొదటి స్థానంలో నిలిచింది. బహిరంగ మల విసర్జన రహిత (ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ) రాష్ట్రాల్లో ఔత్సాహిక అభివృద్ధి మోడల్గా తెలంగాణ నిలుస్తున్నది. దేశంలో 96.74శాతంతో తెలంగాణ నంబర్గా ఉందని కేంద్ర ప్రభుత్వ తాజా నివేదికలో తర్వాత స్థానాల్లో తమిళనాడు 35.39శాతం, కేరళ 19.78శాతం, ఉత్తరాఖండ్ శాతం 9.01శాతం, హర్యానా 5.75శాతం, కర్ణాటక 5.59 శాతం, ఆంధ్ర ప్రదేశ్ 4.63శాతంతో తరువాతి స్థానాల్లో ఉండగా.. జమ్మూకశ్మీర్, బిహార్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, గోవా తదితర ఏడు రాష్ట్రాలు అట్టడుగున ఉన్నాయి.
బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని పార్లమెంట్లో వారం కిందటే రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ స్వచ్ఛ తెలంగాణ, భారత్ కార్యక్రమాల్లో భాగస్వాములైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలు అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తూ.. మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి పథకాల వల్లనే పల్లెలు ఆదర్శంగా మారాయని అన్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు ఇలా అనేక అభివృద్ధి పనులు చేపడుతూనే.. నిరంతరం పారిశుధ్య పనులు చేయడంతో ఇలాంటి ప్రశంసలు, అభినందనలు వస్తున్నాయన్నారు. ఇక దేశంలో 5,82,903 ఆవాసాలు ఉండగా, కేవలం 26,138 ఆవాసాల్లో మాత్రమే బహిరంగ మల విసర్జన రహిత కార్యక్రమాలు జరుగుతుండగా.. 26,138 ఆవాసాల్లోనూ సగానికి మించి 13,737 ఆవాసాలు తెలంగాణలోనివే కావడం విశేషమన్నారు. సీఎం కేసీఆర్ పటిష్ఠమైన నాయకత్వ పరిపాలనలో సాధిస్తున్న అద్భుత ప్రగతికి నిదర్శనమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.