హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా 815 మసీదుల్లో 4.5 లక్షల రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో భాగంగా హజ్ హౌస్ వద్ద సోమవారం రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను మసీదులకు తీసుకెళ్లే వాహనాల మొదటి కాన్వాయ్ను హోంమంత్రి మహమూద్ అలీ జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి మసీదుకు సుమారు 500 బహుమతి ప్యాకెట్లు అందించబడతాయి. పేదలను గుర్తించిన అనంతరం పంపిణీ చేయనున్నారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. అన్ని వర్గాల వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వం చేరుతుందన్నారు. రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వ్యక్తిగతంగా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. మహమ్మారి బారిన పడిన ప్రజలకు అవసరమైన వైద్య, ఇతర సహాయం అందిస్తోందని తెలిపారు.