హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బంగారు వలయంగా మారింది. రహదారుల అభివృద్ధితో ఎటు చూసినా రింగ్ రోడ్డులే దర్శనమిస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి చెందిన రోడ్ నెట్వర్క్తో రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్)కు దాదాపు 100 కి.మీ. దూరంలో సహజంగా మరో రింగ్ ఏర్పడింది. దీనికి మరో రెండు చోట్ల చిన్న లింక్లు కలిపితే అతిభారీ రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. అది ఎలాగంటే.. కర్ణాటకలో తెలంగాణకు ఆనుకొని ఉండే చించోలి నుంచి తాండూరు, మహబూబ్నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, ఖమ్మం, వరంగల్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సిద్దిపేట, రామాయంపేట, మెదక్ మీదుగా ఎల్లారెడ్డి వరకు ఎక్కడా గ్యాప్ లేకుండా రహదారి ఉన్నది. దీనిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేసే పని ఇప్పటికే చాలా వరకు పూర్తయింది.
ఈ రోడ్డులో నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద మంజీరా నదిపై మాత్రమే లింక్ లేదు. మంజీరాను దాటిన తర్వాత సంగారెడ్డి నుంచి డెగ్లూర్ మీదుగా నాందేడ్కు వెళ్లే జాతీయ రహదారి ఉన్నది. దీనిపై నారాయణఖేడ్ నుంచి జహీరాబాద్ వరకు ముంబాయి హైవేకు లింక్గా మరో జాతీయ రహదారి ఉన్నది. అక్కడి నుంచి చించోలి వరకు ఒకచిన్న లింక్ ఇవ్వాలి. ఇక్కడ సింగిల్లేన్ బీటీ రోడ్ ఉన్నది. దీనిని అభివృద్ధి చేసి మంజీరాపై నారాయణఖేడ్ వద్ద.. జహీరాబాద్ నుంచి చించోలి వరకు లింక్ పూర్తిచేస్తే సహజ సిద్ధంగా అతిపెద్ద భారీ రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. ఇది కాకుండా జడ్చర్ల నుంచి దేవరకొండ మీదుగా వచ్చే జాతీయ రహదారికి అనుమల నుంచి నల్లగొండ, నకిరేకల్ మీదుగా అర్వపల్లి వద్ద సూర్యాపేట, సిరిసిల్లకు వెళ్లే రహదారికి కలుస్తున్నది. అక్కడి నుంచి జనగామ, సిద్దిపేట మీదుగా వెళ్లే ఈ రహదారి కూడా రింగ్ను కలుపుతుంది. ఛత్తీస్గఢ్లోని సిరోంచ నుంచి ఉత్తర తెలంగాణలో మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ మీదుగా మహారాష్ట్ట్రలోని బిలోలికి జాతీయ రహదారి ఉన్నది. సిరోంచ నుంచి జగిత్యాల, నిర్మల్ మీదుగా నాందేడ్ వరకు మరో రహదారి ఉన్నది. ఇవన్నీ కలిస్తే అతిపెద్ద రింగ్ రోడ్డు ఏర్పడుతుంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మినహా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా కేవలం 2-3 గంటల్లోనే హైదరాబాద్కు చేరుకోవచ్చు. బీదర్, నాందేడ్, నాగపూర్, సిరోంచ, బీజాపూర్, యాదగిరి, రాయచూర్, గుల్బర్గా, రాయచూర్, కర్నూల్, విజయవాడ, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి తదితర పట్టణాలకు సులువుగా వెళ్లి రావచ్చు.
రాష్ట్రంలో 60 కిలోమీటర్లకు ఒక జంక్షన్
రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో 2,527 కి.మీ. జాతీయ రహదారులు మాత్రమే ఉండేవి. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన రహదారుల నిర్మాణం చేపట్టారు. జాతీయ రహదారుల అభివృద్ధిపై కూడా దృష్టి కేంద్రీకరించడంతో రాష్ర్టానికి అదనంగా 2,469 కి.మీ. జాతీయ రహదారులు వచ్చాయి. సీఎంతోపాటు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, తెలంగాణ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జాతీయ రహదారులతోపాటు ట్రిపుల్ఆర్ నిర్మాణానికి అనుమతులు సాధించడంతో తెలంగాణ ముఖచిత్రం సమూలంగా మారిపోనున్నది. రాష్ట్రంలో రహదారుల నిర్మాణంతో ప్రతి 60 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అనేక జంక్షన్లు ఏర్పాటయ్యాయి. వీటి వద్ద పదేండ్లలో శాటిలైట్ సిటీలు, కమర్షియల్ ఏరియాలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నది.