మహబూబ్నగర్: సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాలమూరు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. తెలంగాణ కోసం జనం ఉద్యమిస్తుంటే, యువత బలిదానాలు చేస్తుంటే.. శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం కలిపి తెలంగాణోత్తరాంధ్ర కావాలని కాంగ్రెస్ హైకమాండ్కు రాష్ట్ర కాంగ్రెస్ లేఖ రాసిందని గుర్తుచేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డుపుల్లలు వేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. 263 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టును వదిలి, 6 టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకోవాలని పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీయేనని మంత్రి విమర్శించారు. వందల కేసులను ఎదుర్కొని పాలమూరు-రంగారెడ్డి పనులను తుదిదశకు తీసుకువచ్చామని, భట్టి విక్రమార్క ఏం జరింగిదో.. ఏం జరుగుతున్నదో.. తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
పాలమూరు వలసలు, ఆకలి చావులకు కారణమే కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ నాలుగు దశాబ్దాల పాలనలో పాలమూరును భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పోతిరెడ్డిపాడుకు పొక్కవెట్టి, పాలమూరు పొట్టగొట్టిందని మంత్రి ఆరోపించారు. జూరాల, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను దశాబ్దాల పాటు సాగదీసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాకనే జూరాల నుంచి పూర్తిస్థాయిలో సాగునీళ్లు అందుతున్నాయని,
కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడులను పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి గురించి ప్రశ్నించే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. పాలమూరు గురించి, ప్రాజెక్టుల గురించి భట్టి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, లేదంటే పోయేది కాంగ్రెస్ పరువేనని మంత్రి వ్యాఖ్యానించారు.