హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయించేందుకు రాష్ట్ర పసుపు రైతుల సంఘం కృషి చేస్తున్నది. దీనిలో భాగంగా సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు ఈ నెల 21న తిరువనంతపురంలో కేరళ వ్యవసాయ శాఖ మంత్రి పీ ప్రసాద్తో సమావేశం కానున్నారు.
తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమాతోపాటు కాళేశ్వరం లాంటి సాగునీటి పథకాలను తమిళనాడు, కర్ణాటకలో అమలు చేయించేందుకు నరసింహం నాయుడు ఇప్పటికే ఆయా రాష్ర్టాల రైతు సంఘాలతో సమావేశాలు నిర్వహించారు. ఇదేవిధంగా తెలంగాణ పథకాలను కేరళలోనూ అమలు చేయించేందుకు తిరువనంతపురం వెళ్తున్నారు.
ఆయన వెంట ఖమ్మం జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, ఉత్తరాంధ్ర కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు గాడి శివకృష్ణారావు వెళ్లనున్నారు. వీరంతా 21న దక్షిణ భారత రైతు సంఘాల నాయకులు పీకే దైవశిగామని, ఏఎస్ బాబు, కేఎం రామగొండర్ (తమిళనాడు), కే శాంతకుమార్ (కర్ణాటక), పీటీ జాన్, కేవీ బిజూ (కేరళ)తో కలిసి కేరళ వ్యవసాయ శాఖ మంత్రికి వినతిపత్రం అందజేస్తారు.