హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): ఎమర్జింగ్ టెక్నాలజీతో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహారిస్తున్నదని ఐటీ నిపుణురాలు రమాదేవి లంక చెప్పారు. ఢిల్లీ వేదికగా ఈ నెల 19న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా సమ్మిట్-22లో ఆమె ప్రత్యేక ఆహ్వానితురాలిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆమె సాంకేతికత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ శాఖ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ను ఏర్పాటుచేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, క్లౌడ్, డ్రోన్, స్పేస్ టెక్నాలజీ వంటి అంశాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నదని రమాదేవి తెలిపారు. తెలంగాణ ఏఐ మిషన్, బ్లాక్ చెయిన్, సైబర్ సెక్యూరిటీ, ఈ వేస్ట్ ఎక్సలెన్సీలను ఏర్పాటుచేసి ఆయా రంగాలలో ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తునదని వివరించారు. తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ఆధ్వర్యంలో 12 రంగాలలో 35కు పైగా ప్రాజెక్టులు చేపట్టిందని తెలిపారు.