హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 19 (నమస్తే తెలంగాణ): బీజేపీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వేర్వేరుగా టచ్లో ఉన్నారని, ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ సంచలనం చోటుచేసుకోబోతున్నదని తెలంగాణ ఉద్యమకారుడు, సామాజిక విశ్లేషకుడు గాదె ఇన్నయ్య చెప్తున్నారు.
రేవంత్ సర్కారు పాల‘పొంగు’లాంటిదేనని, బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూలటం ఖాయమనే పక్కా సమాచారం ఉన్నదని అంటున్నారు. రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో పాటు బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్న ‘ఆపరేషన్ తెలంగాణ’పై ఆయన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేయడమే లక్ష్యంగా బీజేపీ నడిపిస్తున్న ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత ఒక పావు మాత్రమేనని, రోజుల వ్యవధిలోనే కేజ్రీవాల్ అరెస్టుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధమైనట్టు తనకు సమాచారం ఉన్నదని తెలిపారు. కేజ్రీవాల్ అరెస్టుతో కథ సుఖాంతం చేస్తారని వెల్లడించారు. ఇంకా పలు ఆసక్తికర రాజకీయ పరిణామాలపై ‘నమస్తే తెలంగాణ’తో గాదె ఇన్నయ్య పంచుకున్న అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లక్ష్యంగా ప్రారంభమైన ఢిల్లీ మద్యం వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయాలని తెలంగాణ బీజేపీ నుంచి డిమాండ్ వచ్చింది. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటేనన్న అభిప్రాయం ప్రజల్లో ఉన్నది.. ప్రజలు బీజేపీని నమ్మాలంటే కవితను అరెస్టు చేయాలని బండి సంజయ్, అరవింద్ వంటి వారితో పాటు అనేక మంది అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు.
కానీ పైనుంచి మాత్రం అసెంబ్లీ ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున పెద్దఎత్తున సానుభూతి వస్తుందని వారించింది. చివరకు అప్పట్లో బీజేపీతో సంప్రదింపులు చేసిన ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూడా తాను చేరేందుకు ఇదే షరతు విధించారు. కానీ బీజేపీ హైకమాండ్ ససేమిరా అన్నది. పార్టీలోకి ఎవరు వచ్చినా, రాకున్నా అరెస్టు చేసేది లేదని తేల్చిచెప్పింది.
బెంగాల్ అనుభవంతోనే ఆ నిర్ణయం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవటం వెనుక బీజేపీకి పశ్చిమ బెంగాల్ అనుభవమే ప్రధాన కారణం. అక్కడ మమతాబెనర్జీ లక్ష్యంగా చేపట్టిన ఐటీ, ఈడీ దాడులు, అరెస్టులు ఆమెపై ప్రజల్లో గణనీయమైన సానుభూతిని తెచ్చిపెట్టాయి. దీంతో టీఎంసీ మళ్లీ అధికారంలోకి వచ్చిందనేది బీజేపీ పెద్దల అభిప్రాయం. దీంతో పాటు ఆయా పార్టీలు అధికారంలో ఉన్నపుడు ఇలాంటి దాడులు చేస్తే తమకు పెద్దగా ప్రయోజనం ఉండదని బీజేపీ అధిష్ఠానం నమ్మింది.
జార్ఖండ్లో హేమంత్ సోరెన్ను అరెస్టు చేస్తే ఆయన భార్యను సీఎంగా చేసిన అనుభవాన్ని కూడా తెలంగాణ బీజేపీ నేతలకు అధిష్ఠానం వివరించింది. దీంతో బండి సంజయ్, అరవింద్, కిషన్రెడ్డి వంటి వాళ్లు కన్విన్స్ అయ్యారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలాంటి వాళ్లు కన్విన్స్ కాలేక పార్టీ మారారు. ఎవరున్నా, పార్టీ మారినా తమ నిర్ణయం మారదని అప్పట్లో బీజేపీ అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని స్వయంగా బండి సంజయ్ నాతో చెప్పారు.
కేజ్రీవాల్ అరెస్ట్తో ఫస్ట్ హాఫ్ పూర్తి
కేజ్రీవాల్ లక్ష్యంగా సాగుతున్న ఢిల్లీ మద్యం వ్యవహారంలో అదను చూసి కవితను అరెస్టు చేశారు. ఇన్ని రోజులు అరెస్ట్ కాకపోవడం వెనక సుప్రీంకోర్టు, న్యాయపరమైన అంశాలు.. ఇవన్నీ ఒట్టి బూటకం. అదే నిజమైతే, ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉండగానే ఎందుకు అరెస్టు చేశారు? అరెస్టు ఎందుకు చేశారనేది పక్కనబెడితే, అరెస్టు చేసిన విధానమైతే తప్పు అని అందరూ ఒప్పుకుంటున్నదే కదా. బీజేపీ పెద్దలు రాజకీయంగా అనుకూల పరిస్థితులు ఉన్నపుడే ఇలాంటి పావులు కదుపుతారు. అందులో భాగంగానే తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కేజ్రీవాల్ను అరెస్టు చేయాలంటే ముందుగా కవితను అరెస్టు చేయాలి. అందుకే అరెస్టు రోజే మల్కాజిగిరిలో ప్రధాని మోదీ పెద్దఎత్తున రోడ్షో నిర్వహించడాన్ని అర్థం చేసుకోవాలి. పోలింగ్కు ఇంకా 50 రోజులకు పైగా సమయం ఉన్నది. అయినా ప్రధాని ఇటీవల ఐదు రోజుల పాటు తెలంగాణలో ఉన్నారంటే రాష్ట్రంపై బీజేపీ అధిష్ఠానం ఎంత ఫోకస్ పెట్టిందో అర్థమవుతుంది. ఇక, ఢిల్లీలో కేజ్రీవాల్ రోజుల వ్యవధిలోనే (బహుశా ఈ నెల 23 వరకు) ఆయనను అరెస్టు చేస్తారన్న సమాచారం ఉన్నది. కేజ్రీవాల్ న్యాయపరంగా ఏమైనా అడ్డంకులు కల్పించినా రోజుల వ్యవధే తప్ప త్వరలో ఆ అరెస్టుతో ఫస్ట్ హాఫ్ను ముగిస్తారు.
ఐదారు నెలలు పొంగులేటి సంప్రదింపులు
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దాదాపు ఐదారు నెలల పాటు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. ఒక దశలో ఆయన ఆ పార్టీలోకే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జరిగిన చర్చల్లో పొంగులేటి కవిత అరెస్టు డిమాండ్ను బీజేపీ ముందుంచారు. ఆ పార్టీ పెద్దలు అది కుదరదని చెప్పేశారు. కనీసం కాళేశ్వరం అక్రమాలంటూ అప్పటి సీఎం కేసీఆర్ను టార్గెట్ చేయాలని కోరారు. కానీ అది మొదటికే మోసం వస్తుందని, కేసీఆర్ లాంటి ఉద్యమకారుడిని టచ్ చేస్తే బూమరాంగ్ అవుతుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో పొంగులేటి మనసు మార్చుకున్నారు. ఇదే కారణాన్ని చూపి బీజేపీలో చేరేందుకు నిరాకరించారు.
ఎన్నికల తర్వాత అసలైన సెకండాఫ్
ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. ఎవరికివారు బీజేపీతో టచ్లో ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ గేమ్ ప్లాన్లో అసలైన సెకండాఫ్ను మొదలు పెట్టనున్నది. అయితే ఇందులో అటు రేవంత్? ఇటు పొంగులేటి? ఎవరిని ఎంచుకోవాలనే దానిపై ఆ పార్టీ పెద్దల్లో పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చినట్టు లేదు. రేవంత్రెడ్డి 18 మంది ఎమ్మెల్యేలు, పొంగులేటి 12 మంది ఎమ్మెల్యేలు.. మద్దతు ఉన్నట్టుగా బీజేపీకి చెప్పుకున్నట్టు తెలిసింది.
ఎలాగూ బీజేపీకి 8 మంది ఉన్నారు. వీటితో గేమ్ను మొదలుపెడితే అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వరదలా వచ్చిపడతారనే అంచనాతో బీజేపీ ఉన్నది. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే లేని రాష్ట్రంలోనే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే వాళ్ల దాడి ఎలా ఉంటదో ఊహించుకోవచ్చు. ఏకంగా 16 రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేశారు. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇక తిరుగేముంది? ప్రతిపక్షాలు ఢీలా పడతాయి. ఇందులో రేవంత్రెడ్డికి మొదటి ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆయనను పెద్దగా నమ్మటం లేదు. పొంగులేటి ఇప్పటికే ఐదారు నెలల పాటు టచ్లో ఉండటంతో పాటు కాంట్రాక్టర్, వ్యాపారవేత్త అయినందున తమ కనుసన్నల్లో ఉంటాడనే నమ్మకం బీజేపీ పెద్దల్లో ఉన్నది.
ప్రపంచీకరణతోనే ప్రజల్లో చైతన్యం పోయింది
ఎన్నికల తర్వాత బీజేపీ గేమ్ప్లాన్లో భాగంగా పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బీజేపీ ముఖ్యమంత్రిగా ఇక్కడ కూర్చునే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ఆయన ఎప్పుడూ బీజేపీ చెడ్డ పార్టీ అని చెప్పలేదు. కేవలం కేసీఆర్ను దించాలంటే అది కాంగ్రెస్తోనే సాధ్యమైనందున ఆ పార్టీలోకి వెళ్తున్నానని చెప్పారు. 1984లో నాదెండ్ల భాస్కర్రావు ఎపిసోడ్ జరిగినపుడు నేను పీపుల్స్వార్ పార్టీలో పని చేస్తున్నాను. ఎన్టీఆర్ను దించినందుకు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లు, వీధుల్లోకి వచ్చి తిరుగుబాటు చేశారు. కానీ ఇప్పుడు ఆ చైతన్యం లోపించింది.
1991 ప్రపంచీకరణ తర్వాత ప్రధానంగా మధ్యతరగతి అనేది విస్తృతమైంది. దీంతో శాస్త్రవేత్త మొదలు సామాన్య కూలీ వరకు ఈఎంఐ బతుకుల్లో బందీ అయ్యారు. నాకెందుకు? అది నా సమస్య కాదు కదా! ఇలాంటి చట్రంలో ఇరుక్కుపోయారు. లేకపోతే, రాజ్యాంగాన్నే మారుస్తామని బీజేపీ ఎంపీ ప్రకటించినా బుద్ధిజీవులు ఎందుకు నోరు మెదపటం లేదు. కనీసం రాజ్యాంగం ద్వారా ఫలాలు, ప్రయోజనాలు పొందుతున్న వారు కూడా దీనిపై గళం విప్పడం లేదంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ లక్ష్యం ఎందుకంటే?!
కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కానీ బీజేపీ పెద్దలు అక్కడ పెద్దగా గేమ్ ఆడాల్సిన అవసరం లేదనే నిర్ణయానికొచ్చారు. అధికారంలో హస్తం చేతుల్లోనే ఉన్నా, ఆ రాష్ట్రం తమ ఆధీనంలోనే ఉన్నదనే భావన వారిలో ఉన్నది. అందుకే ఎప్పుడంటే అప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని కూల్చివేయొచ్చనే అభిప్రాయంలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత అక్కడ కూడా ప్రభుత్వాన్ని కూల్చి, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనటంలో సందేహం లేదు. కాకపోతే తెలంగాణపైనే మోదీలాంటి వాళ్లకు ప్రత్యేక దృష్టి ఉన్నది. ఇందుకు రెండు బలమైన కారణాలు ఉన్నాయి.
గతంలో బీజేపీకి దేశవ్యాప్తంగా కేవలం రెండు ఎంపీ సీట్లు ఉన్నపుడు అందులో ఒక సీటు తెలంగాణలోని హనుమకొండ స్థానం. అక్కడి నుంచి జంగారెడ్డి బీజేపీ ఎంపీగా గెలిచారు. పైగా ఇక్కడ బలమైన బీజేపీ, ఆరెస్సెస్ క్యాడర్ ఉన్నది. ఇలా చరిత్ర చూస్తే ఇంత అనుకూలంగా ఉన్నప్పటికీ పార్టీ ఆశించిన స్థాయిలో ఎందుకు ఇక్కడ సక్సెస్ కాలేకపోయింది? వ్యూహాలు ఎక్కడ దెబ్బతిన్నాయి? ఇలా అనేక సందేహాలు బీజేపీ పెద్దల్లో ఉన్నాయి. అందుకే పట్టుదలతో తెలంగాణపై ఫోకస్ పెట్టారు.
రెండోది.. వామపక్ష భావజాలం. దేశంలోని ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో వామపక్ష తీవ్రవాదం ఉన్నా, బేస్ తెలంగాణ నుంచే ఉన్నది. కమ్యూనిస్టు రాష్ట్రంగా ఉన్న పశ్చిమ బెంగాల్లో ఆ పార్టీని దెబ్బకొట్టగలిగినా, తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టలేకపోతున్నామనే భావన వారిలో ఉన్నది. అందుకే ఇక్కడ పాగా వస్తే తప్ప వామపక్ష భావమూలాలను పెకిలించలేమనే నిర్ణయానికొచ్చారు.